వీణవంక, సెప్టెంబర్ 28: స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారుతోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఉద్ఘాటించారు. వీణవంకలో మంగళవారం జరిగిన ఆర్యవైశ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్యవైశ్యులను ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉండేవారని చెప్పారు. కానీ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం దక్కిందని, ముఖ్యంగా రాజకీయంగా ఆర్యవైశ్యులకు తగిన సీట్లు కేటాయించారని కొనియాడారు. ఆర్యవైశ్యులకు హైదరాబాద్తో పాటు చాలా నగరాలు, పట్టణాలలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించి, సంక్షేమ నిధిని రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇటీవల హుజూరాబాద్, జమ్మికుంటలోనూ సంఘ భవనాల నిర్మాణ ప్రక్రియ మొదలైందని, మండలంలోనూ స్థలం కేటాయించి , భూమిపూజ చేయనున్నుట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్కు అండగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆశీర్వదించి.. అసెంబ్లీకి పంపండి: గెల్లు శ్రీనివాస్ యాదవ్
“నేను మీ కండ్ల ముందు పెరిగిన బిడ్డను. మీ కండ్ల ముందు తిరిగినోన్ని. ఆశీర్వదించి.. అసెంబ్లీకి పంపండి.. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’ అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పనులు చేసేవారిని గుర్తించాలని, అభివృద్ధి చేసే పార్టీకి అండగా ఉండాలని కోరారు. టీఆర్ఎస్తోనే హుజూరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే రెండున్నరేండ్లలో ఎంతో అభివృద్ధి జరుగనుందని తెలిపారు. మండలంలోని ఆర్యవైశ్యులతో ఎంతో అనుబంధం ఉందని, మీ బిడ్డగా ఆదరించాలని కోరారు. పేదలైన వారికి ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కట్టించలేదని, మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, ఆర్యవైశ్య కులసంఘం సమస్యలు ఏమి ఉన్నా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరిస్తానని తెలిపారు. ఇక్కడ ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు నగమల్ల కోటేశ్వర్, ప్రధానకార్యదర్శి రామిడి శ్రీధర్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు నాగమల్ల దయాకర్, వీణవంక గ్రామ శాఖ అధ్యక్షుడు కాసనగొట్టు వెంకటరమణ, నాయకులు శేఖర్, అల్లెంకి నాగన్న, సతీశ్, పున్నంచందర్, రవి, లక్ష్మయ్య ఉన్నారు.