జమ్మికుంట, జూలై 31: ‘అబద్ధాల పునాదులపైనే బీజేపీ పుట్టింది. ఆ పార్టీదంతా స్కాంల చరిత్ర. దాడులు చేయడం వారి నైజం. ఆ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలి. ధాన్యం కొనుగోళ్లు చేయొద్దన్నందుకా..? రైతులకు ఉచిత కరెంటు వద్దంటున్నందుకా..? నల్ల చట్టాలు తెచ్చినందుకా..? జీఎస్టీ అమలు చేస్తున్నందుకా..? పెద్దనోట్లు రద్దు చేసినందుకా..? ఉద్యోగాలు కల్పించనందుకా..?రిజర్వేషన్లు తొలిగించే ప్రయత్నం చేస్తున్నందుకా..?ప్రైవేటీకరణ చేస్తున్నందుకా..? ఎందుకెయ్యాలో ఆ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా గమనిస్తున్నరు. మాయ మాటలు వినే పరిస్థితుల్లో ప్రజల్లేరు. తగిన గుణపాఠం చెబుతరు.’అని మంత్రి కొప్పల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వచ్చారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల 31.30కోట్ల నిధులు విడుదల చేయగా, అభివృద్ధి పనులన్నింటికీ మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృధ్ధి, సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ర్టాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, కేసీఆర్కే మద్దతు పలుకుతున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్లో గులాబీ జెండాయే ఎగురుతుందని తెలిపారు. బీజేపీ అంటేనే స్కాంలకు పెట్టింది పేరని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క స్కాం కూడా లేదని పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నారని, వారిని ప్రజలు క్షమించరని చెప్పారు. బీజేపీ నేత ఈటల మౌళిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని దయ్యబట్టారు. పెండింగ్ పనులన్నీ ఎన్నికల్లోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన నిధులను నాణ్యతా ప్రమాణాలతో జరుగుతాయని తెలిపారు. దళిత బంధు వినూత్న పథకమని, ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే పథకంపై కూడా విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ఇక్కడ వరంగల్ ఎమ్మెల్యే నరేందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కమిషనర్ సుమన్రావు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.