సిరిసిల్ల టౌన్, జూలై 29: ఎన్ని యుగాలైనా తరిగిపోని సాహితీ సుగంధం డాక్టర్ సీ నారాయణరెడ్డి అని ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కీర్తించారు. జ్ఞాన సంపన్నమైన సమాజ నిర్మాణం కోసం అనేక రచనలు చేశారని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో డాక్టర్ సినారె 90వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. గోరెటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లాకు చెందిన 10 మందికి స్మారక అవార్డులు రూ.10వేల ప్రోత్సాహకాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం గర్వించదగిన సాహితీవేత్త సినారె మానేటి ముద్దబిడ్డ కావడం గర్వకారణమన్నారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత తెలుగులో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. సినీ గేయ రచయితగా దాదాపు 3వేల పైచిలుకు పాటలు రాశారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మారసం కార్యదర్శి ఎలగొండ రవి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జనపాల శంకరయ్య, బూర దేవానందం, చిటికెన కిరణ్ పాల్గొన్నారు.