కమాన్చౌరస్తా, జూలై 29 : ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పూర్తిస్థాయిలో నిండిన తర్వాతే విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లేలా ప్రభుత్వ కళాశాలల డిమాండ్ పెరగాలని, అందుకోసం నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం ఆయన శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. అనంతరం నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలను శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కెడెట్లు వారికి ఘన స్వాగతం పలికారు. కళాశాల ప్రాంగణంలో మియావాకీ పద్ధతిలో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్ చాంబర్లో కళాశాల సమగ్ర నివేదికను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీక్షించి, కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నవీన్మిట్టల్ మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ విద్యా ప్రమాణాల పెంపు కోసం కృషి చేయాలన్నారు. ఎస్సారార్ కళాశాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదని, ఇక్కడ దాదాపు 25 మంది ప్రొఫెసర్లు పీహెచ్డీ పూర్తి చేయగా, ఇంకా 20 మంది పీహెచ్డీ చేస్తున్న ప్రొఫెసర్లు ఉన్నారని, వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన, చదివిన విద్యార్థులు ఎంతో నిష్ణాతులుగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలకు అవసరమున్న అనదపు గదుల నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కళాశాల విద్యా వ్యవస్థ మార్పు కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తోనే ప్రారంభమైందని, ఈ మార్పును భావితరాలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అకాడమిక్ కోఆర్డినేటర్, ఎన్సీసీ అధికారి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాలను పరిశీలించి, కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఎస్యూలో పాలక మండలి సమావేశం..
శాతవాహన యూనివర్సిటీ 68వ పాలక మండలి సమావేశంలో కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. అంతకు ముందు శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మల్లేశ్ను ఆయన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎజెండాలోని వివిధ అంశాలను చర్చించారు. పాలకమండలి సభ్యులు ఎం వరప్రసాద్, ఆచార్య భరత్, వేణు, మొగిలయ్య, రామకృష్ణ, దీపిక, ఉమాదేవి, చిట్టిమల్ల శ్రీనివాస్, సురేశ్కుమార్ పాల్గొన్నారు.