జమ్మికుంట, జూలై 31: సంక్షేమంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిపారని, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో సివిల్ సప్లయీస్ ఆధ్వర్యంలో కొత్త రేషన్కార్డులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలువురికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే మున్సిపల్ పరిధిలోని కేశవపురంలో సమ్మక్క ఆలయ అభివృద్ధి కోసం రూ.10లక్షలు కేటాయించగా, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన చేశారు. జమ్మికుంట ఫొటో గ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో సభ్యుల సమావేశం జరుగగా, సమావేశానికి హాజరయ్యారు. సంఘం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎనిమిది మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడారు. అబద్ధాలతో నడిచే పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి హుజూరాబాద్లో స్థానం లేదని దుయ్యబట్టారు. ఈటల ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పుడు అభివృద్ధి చేయలేదని, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావో..? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మనసు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అన్ని వర్గాలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళిక తయారు చేశారని పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని చెప్పారు. ఆడబిడ్డ కట్నం కింద కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ శ్యాం, ఎంపీపీ మమత, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, ఫోటో గ్రాఫర్ల సంఘం నాయకులు రాంబాబు, ఎస్కే హుస్సేన్, గణేశ్, శివ తదితరులు ఉన్నారు.