మౌలిక సౌకర్యాల మెరుగుకు బల్దియా కృషి
వివిధ ప్రాంతాల్లో రూ. 6 కోట్లతో తాగునీటి పైపులైన్లు
ఇతర పనుల ప్రారంభానికి చర్యలు
కార్పొరేషన్, మే 2: కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలతో ఏర్పాటైన శివారు డివిజన్ల అభివృద్ధిపై నగరపాలక వర్గం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రథమ ప్రాధాన్యతతో పనులు చేపడుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నది.
నగరంలోని అనేక డివిజన్లలో ఇప్పటికే మిషన్ అర్బన్ భగీరథ పథకంలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు రిజర్వాయర్లను నిర్మించి తాగునీరు అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరంలోని పలు డివిజన్లకు రూరల్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ప్రతి రోజూ నీటి సరఫరా కావడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలుగు నెలల క్రితమే శివారు డివిజన్లలో మంచినీటి పైపులైన్లు లేని ప్రాంతాలను గుర్తించి కొత్తగా వేసేందుకు రూ. 6 కోట్లను కేటాయించి పనులు చేస్తున్నారు. వీటితో పాటు అవసరమైన ప్రాంతాలకు రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు కూడా ఇంటర్ కనెక్షన్ పనులు చేపట్టారు.
చకచకా పనులు..
ప్రస్తుతం నగరంలోని సుమారు 30 డివిజన్ల పరిధిలో ‘స్మార్ట్సిటీ’ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పట్టణ ప్రగతి నిధులు కూడా వస్తున్నాయి. ఈ నిధులతో నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నారు. వీటితో పాటు నగరపాలక సంస్థ సాధారణ నిధులను కూడా నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధికి కేటాయిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అంచనా బడ్జెట్లోనూ శివారు డివిజన్ల అభివృద్ధికి రూ. 15 కోట్లకు పైగానే నిధులు కేటాయించారు. ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగా నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు నగరపాలకవర్గం ఆమోదం కూడా తెలిపింది. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. శివారు ప్రాంతాల్లో వేగంగా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.