హుజూరాబాద్ రూరల్, జూలై 31: రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉద్ఘాటించారు. మండలంలోని కందుగుల గ్రామంలో శనివారం 750 మంది రైతులు ‘కేసీఆర్కు రైతుల మద్దతు సభ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావుతో కలిసి హాజరైన ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ, కందుగుల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సమావేశ మందిరం కోసం ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, బీమాతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో రైతులకు మండు వేసవిలో కూడా సాగునీటిని ఇస్తున్నామని గుర్తు చేశారు. హుజూరాబాద్ మండలంలోని 19 గ్రామాలకు రూ.15.53 కోట్లు, డ్రైనేజీలకు రూ.8.20 కోట్లు, సీసీ రోడ్లకు రూ.7.33 కోట్ల నిధులు సీఎం కేసీఆర్ విడుదల చేసినట్లు వెల్లడించారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరెంట్ కోతలతో రైతులు పడిన ఇబ్బందులను గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుష్కలంగా నీరు, నిరంతర విద్యుత్తో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కందుగుల రైతు అభివృద్ధి కమిటీ సీడ్ ప్లాంట్ కోసం నాబార్డ్ నుంచి 35శాతం సబ్సిడీతో రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో వరంగల్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మర్నేని రవీందర్రావు, సీఈవో సత్యనారాయణరావు, మాజీ జడ్పీటీసీ కంకణాల విజయరెడ్డి, సర్పంచ్ పడిదం ప్రభావతి, ఎంపీటీసీలు కాసం పద్మ, శిరీష, ఎలతుర్తి ఎంపీపీ మేకల స్వప్న, కందుగుల రైతు సంఘం అధ్యక్షుడు హుస్సేన్, ఉప సర్పంచ్ బెల్లి రాజయ్య, రైతు సంఘం కార్యవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.