కొండగట్టులో కొనసాగుతున్న చాలీసా పారాయణం
నిన్నటితో మండల కాలం పూర్తి
మరో మండలకాలం కొనసాగింపు
హనుమత్స్మరణతో మార్మోగుతున్న అంజన్న క్షేత్రం
పెద్ద జయంతి రోజున.. రామకోటి స్తూప ప్రతిష్ఠాపన
మల్యాల, ఏప్రిల్ 26: జయ హనుమాన జ్ఞాన గుణసాగర…జయ కపీశ తిహులోక ఉజాగర’ అంటూ భక్తుల హనుమత్స్మరణతో కొండగట్టు అంజన్న క్షేత్రం మార్మోగుతున్నది. వేలాది మంది భక్తుల సమక్షంలో మార్చి 17న అఖండ హనుమాన్ చాలీసా పారాయణానికి అంకురార్పణ జరుగగా నాటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నది. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో జూన్ 4 వరకు రెండు మండలాల కాలం పాటు సాగే పారాయణం సోమవారంతో మండల కాలాన్ని (41రోజులు) పూర్తి చేసుకొంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంజనేయస్వామివారిని ఫిబ్రవరి 25న దర్శించుకున్నారు. కాశీలోని మహంతు సూచన మేరకు అంజన్న సన్నధిలో మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంకల్పించారు.
ఆలయ అర్చకులు, దాతలు, ప్రజాప్రజాప్రతినిధులతో అంజన్న సేవాసమితిని ఏర్పాటు చేశారు. మార్చి 9న ఎమ్మెల్సీ కవిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలసి రూ. 90 లక్షలతో చేపట్టనున్న రామకోటి స్తూపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. మార్చి 17 న 5 కోట్ల రామప్రతులను కొండగట్టు ఆలయానికి తీసుకురావడంతో పాటూ అఖండ హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టారు. అప్ప టి నుంచి ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్యలో ఒక గంట పాటు, కొండపై ఉండే భక్తులు, అర్చకులు కలిసి 11 సార్లు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాల్లో సైతం గంట పాటు భక్తులు చాలీసా పారాయణం చేయాలని అంజన్న సేవా సమితి పిలుపునిచ్చింది.
స్తూపం ప్రతిష్ఠాపకు ఏర్పాట్లు..
దక్షిణ భారతదేశంలోనే తొలి రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సంకల్పించింది. కొండపైన రూ. 90 లక్షలతో అత్యద్భుతంగా 23 అడుగుల ఎత్తుతో స్తూపాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల రామ నామ లిఖితాలు ఉండగా వాటన్నింటినీ మార్చి 17న ఎమ్మెల్సీ కవిత కొండగట్టుపైకి శోభాయాత్రగా తీసుకువచ్చి స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చన చేసిన తర్వాత పారాయణ వేదికపై భద్రపరిచారు. పారాయణం జరిగే 82 రోజుల వ్యవధిలో మరో 6 కోట్ల రామనామ లిఖిత ప్రతులను భక్తుల నుంచి సేకరించేందుకు రామకోటి పుస్తకాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఏప్రిల్ 6న ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేశా రు. వాటన్నింటిని జూన్ 4వ తేదీ లోగా ఆలయం లో సేకరించి హనుమాన్ పెద్ద జయంతి పర్వదినం రోజున మొత్తం 11 రామకోటి లిఖిత ప్రతులతో రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించేందుకు సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.