గన్నేరువరం, జూలై 31 : మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షుడు గూడూరి సురేశ్ హెచ్చరించారు. గన్నేరువరంలోని యువసేవా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని రసమయి ఏడేండ్లలో చేశారన్నారు. తాగు నీరు సైతం దొరకని ప్రాంతంలో కాళేశ్వర జాలాలతో చెరువులు నింపి సాగు కష్టాలు తీర్చారని గుర్తు చేశారు. రసమయిని రాజీనామా చేయాలనేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఎంపీ బండి సంజయ్ మానకొండూర్ నియోజక వర్గానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారో తెలుపాలన్నారు. ఎన్నికల హామీలైన గన్నేరువరం బ్రిడ్జి సంగతి ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ మండల నాయకులకు సమస్య వచ్చినప్పుడు ఎంపీ కనీసం ఫోన్ ఎత్తకపోవడంతో టీఆర్ఎస్ నాయకులను ఆశ్రయిస్తున్నారన్నారు. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉన్న రసమయిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ మెరుగు రామూ గౌడ్, యువజన విభాగం గ్రామాధ్యక్షుడు పాలెపు అజయ్, నాయకులు పత్తి అంజి, బత్తిని రవీందర్, సాయి, అచ్యుత్, శ్రీనివాస్, తిరుపతి, శేఖర్, గంగరాజు ఉన్నారు.