కరీంనగర్, సెప్టెంబర్ 28 (కరీంనగర్ ప్రతినిధి) : హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిందని, హుజూరాబాద్ ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారని తెలిపారు.
తక్షణమే అమల్లోకి కోడ్..
షెడ్యూల్ విడుదలతో కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న ఆన్గోయింగ్ పథకాలు, పనులు ఎప్పటిలాగే కొనసాగుతాయని, కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండదన్నారు. ఏదైనా అత్యవసరముంటే.. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల తనిఖీ బృందాలు, ఫ్లయింగ్ స్కాడ్, వీడియో వీవింగ్ టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..
ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ 75 శాతం పూర్తయిందని, డబుల్ డోస్ వ్యాక్సినేషన్ 50 శాతానికిపైగా పూర్తయిందన్నారు. అయితే డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని మాత్రమే ఎన్నికల విధుల నిర్వహణకు వినియోగిస్తామని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా వినియోగించే పోలింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లకు కూడా కచ్చితంగా సెకండ్ డోస్ పూర్తి కావాలని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులను తరుచుగా సబ్బుతో గాని, శానిటైజర్తో గాని శుభ్రపరుచుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
మూడు వాహనాలు మాత్రమే..
నామినేషన్ రోజు అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాదు, ఈసారి నామినేషన్కు సంబంధించి ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు పది రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అర్హత ఉంటుందని, ఆ మేరకు జాబితా పరిశీలించి పూర్తి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గీత దాటితే వేటు : సీపీ
హుజూరాబాద్ ఎన్నికలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా సీపీ సత్యనారాయణ తెలిపారు. ఎవరూ ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించినా, లేదా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నంచేసినా వేటు తప్పదని హెచ్చరించారు. రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారిని బైండోవర్ చేస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని, ర్యాలీలు, సభలు, సమావేశాల వంటివి అధికారుల అనుమతితో నిబంధనలకు లోబడి నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. హుజూరాబాద్ వైపు వెళ్లే అన్ని చోట్లా వాహన తనిఖీలు, పికెటింగ్లు ఉంటాయని, అందరూ సహకరించాలని విజ్ఞపి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిష్పక్షపాతంగా, కఠినంగా అమలు చేస్తామని, ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూములను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అలాగే సోషల్మీడియా వేదికగా తప్పుడు పోస్టింగ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించాలని కలెక్టర్, సీపీ విజ్ఞప్తి చేశారు.