కార్పొరేషన్, ఆగస్టు 3: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 13వ డివిజన్ హస్నాపూర్ కాలనీలో మంగళవారం ఆయన పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మానేరు డ్యాం కట్ట దిగువ ప్రాంతంలో సీఫేజ్ వాటర్తో పాటు డ్రైనేజీ వాటర్ చేరి కుంటలా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు మేయర్కు విన్నవించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కాలనీలో మురుగు నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత పరిష్కారానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వానకాలంలో మురుగు నీరు నిలిచి దోమలు పెరిగే అవకాశం ఉందని, ఖాళీ స్థలాలను సంబంధిత యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయడం, ఆయిల్ బాల్స్ వేయడం, గంబూషియా చేప పిల్లలు వదలడం వంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే 4 యంత్రాలతో ఫాగింగ్ చేస్తున్నామని, మరో రెండు యంత్రాలు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకొని నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. చుట్టు పకల అపరిశుభ్రంగా ఉన్న స్థలాల యజమానుల వివరాలు నగరపాలక సంస్థకు అందిస్తే, వారి ద్వారా నీటిని తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.