దిక్కుతోచనిస్థితిలో భార్యాబిడ్డలు, వృద్ధురాలైన తల్లిదండ్రులు
పింఛన్, రేషన్ బియ్యమే ఆధారం
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
ధర్మారం, మే3:కరోనా కాటుకు పెద్దదిక్కు బలవ్వడంతో భార్యాబిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రులు పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పింఛన్ డబ్బులు, రేషన్ బియ్యంతోనే బతుకును వెళ్లదీస్తున్నారు. దయార్థ్ర హృదయులు ముందుకువచ్చి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు.
ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రేశవేని మల్లయ్య (38)కు భార్య లావణ్య, ఐ దేండ్ల కూతురు శ్రావ్య, మూడేండ్ల కొడుకు కార్తిక్, వృద్ధులైన తల్లిదండ్రులు భూదమ్మ, రాజయ్య ఉన్నారు. తల్లిదండ్రులు గ్రామంలోని పూరి గుడిసెలో నివసిస్తుండగా, మల్లయ్య భార్యాపిల్లలతో కలిసి అదే ఊరిలో అద్దెకు ఉంటున్నాడు. గతేడాది లాక్డౌన్కు ముందు ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ డ్రైవర్గా పనిచేసేవాడు. నెలనెలా వచ్చే జీతం డబ్బులు ఎనిమిదివేలతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రస్తుతం పాఠశాల మూతబడడంతో ఓ వ్యక్తి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న తరుణంలో గత నెల 29న మల్లయ్య కరోనాతో చికిత్స పొందుతూ కరీంనగర్ దవాఖానలో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాకుండానే కరీంనగర్లోనే ఖననం చేశారు. మల్లయ్య మరణంతో భార్యాబిడ్డలు కిరాయి ఇంటిని వదిలిపెట్టి అత్తామామలు ఉంటున్న పూరిగుడిసెకు చేరుకున్నారు. ప్రస్తుతం కడు దయనీయస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. దాతల సాయం కోసం చేతులు జోడించి వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు రేశవేని లావణ్య పేరిట ఉన్న ధర్మారం యూనియన్ బ్యాంక్ ఇండియా ఖాతా నంబర్ 011510100338566, ఐఎఫ్ఎస్సీ కోడ్: యూబిఐఎన్ 0801151లో జమచేయాలని లేదంటే 9000343846 ఫోన్ చేసి చేయూతనందించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.