కరీంనగర్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ఉదాత్త ఆశయంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారితే.. మరోవైపు బీజేపీ నేత ఈటల రాజేందర్ మాత్రం ముందు నుంచీ ఈ పథకాన్ని ఆపే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. అంతేకాదు, పరోక్షంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి, సదరు ఫిర్యాదు కాపీలను తన సొంత సోషల్ మీడియా సైట్లలో విస్తృత ప్రచారం చేశారు. నిజానికి ఈ పథకం అమలు కాకుండా ఉండేందుకు ఆది నుంచీ అనేక అడ్డదారులు తొక్కారు. దళితబంధు అమలును ఆపాలంటూ గత జూలైలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నాయకుడు పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశారు. వీరు ఫిర్యాదు చేసిన విషయం బయటకు రాకముందే సదరు ఫిర్యాదు కాపీలను రాజేందర్తోపాటు బీజేపీ నాయకుల సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఫిర్యాదు వెనుక రాజేందర్ హస్తం ఉందని భావించి అప్పుడే దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో బీజేపీ నాయకులు మాట మార్చారు. ఆ లేఖలకు తమకు ఏమి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దళితబంధు హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఉద్దేశించి పెట్టింది కాదని, గత బడ్జెట్లోనే దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద వేయి కోట్లు కేటాయింపులు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపాలని చేసిన కుట్రలను నిలిపివేసింది. ఇచ్చిన హామీ మేరకు హుజూరాబాద్లో మెజార్టీ కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింప జేస్తూ వచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంచుకున్న వివిధ స్కీంలు ప్రస్తుతం గ్రౌడింగ్ అవుతున్నాయి. స్పీడ్ అందుకుంటున్న తరుణంలో నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయడంతో ఒక్కసారిగా దళితుల్లో పిడుగు పడ్డపడినట్లయింది.
ఆది నుంచీ ద్వంద్వ వైఖరి..
బీజేపీ నేత రాజేందర్ ముందు నుంచీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారు. ఓవైపు దళితబంధు అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూనే.. మరోవైపు ఒక్క హుజూరాబాద్కే ఎందుకిస్తరు? అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలంటూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు. అంతేకాదు, గతంలో ఈసీకి ఫిర్యాదులు వెళ్లిన విషయం తనకు తెలియదన్నట్లుగా చెబుతూనే.. ఫిర్యాదు కాపీలను తన సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పథకాన్ని అడ్డుకోవడానికి పలువురిని రంగంలోకి దింపి రెచ్చేగొట్టే ప్రయత్నాలు చేయించారు. నిజానికి ఆయన కేబినెట్లో ఉండగానే.. దళితబంధు పథకానికి రూపకల్పన జరుగడమే కాదు, బడ్జెట్లో వేయి కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కప్పి పుచ్చి కేవలం ఎన్నికల కోసమే దళితబంధును అమల్లోకి తెచ్చారంటూ అక్కసు వెల్లగక్కారు. ఓవైపు నమ్మించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు వారి వెన్నుల్లో చివరకు ఈటలు దింపారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రస్తుతం అంతా అయోయం నెలకొంది. ఇంకా లబ్ధిపొందాల్సిన వారు, అలాగే డబ్బులతో వివిధ స్కీంలు గ్రౌండింగ్ చేసుకునే వారిపై ఈ ప్రభావం ఉండనున్నది.
భగ్గుమన్న దళితబిడ్డలు..
బీజేపీ నేత ఈటల రాజేందర్పై దళితులు భగ్గుమంటున్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశ పెడితే.. రాజేందర్ ఈ పథకాన్ని ఆపేందుకు ఆది నుంచీ కుట్రలు పన్నాడని ధ్వజమెత్తారు. జూలైలోనే ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నాయకుడు పద్మనాభరెడ్డితో గతంలో ఫిర్యాదు చేయించారని, గత సెప్టెంబర్లో రాజేందర్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ బయటికి వచ్చిందని మండిపడుతున్నారు. ఇవాళ దళితబంధు అమలును ఆపేసి, నోటికాడి బుక్కపై మట్టిచల్లారని ఆగ్రహిస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. కమలాపూర్ మండల కేంద్రంలో పెద్దసంఖ్యలో దళిత యువకులు రోడ్డుపై బైఠాయించారు. ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాలతోపాటు కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం, ఉప్పల్ గ్రామాల్లో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. దళితబంధు పథకాన్ని రాకుండా చేసి, దళిత కాలనీలకు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తావని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికలో ఓటుతో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. గెల్లు సీను గెలిపించుకొని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.
నిలిపివేస్తున్నాం : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి (డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) అమలును ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు నిలిపి వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు వెల్లడించారు.
బీజేపీని తరిమికొడుతం..
నాలాంటి పేదవాళ్లు బాగుపడాలని కేసీఆర్ సార్ దళితబంధు పథకం పెడితే బీజేపోళ్లు అడ్డుపడవట్టే. పథకం మొదలైనప్పటి నుంచి ఆపాలని ఎన్నో కుట్రలు చేసిన్రు. దళితులు బాగుపడడం బీజేపీకి, ఆ పార్టీలో చేరిన ఈటలకు ఇష్టం లేదు. పథకం అమలై, దళితులు బాగుపడితే వారికి పుట్టగతులుండవని, గెలుపు సాధ్యం కాదని కుట్ర చేసిన్రు. నాకు దళితబంధు డబ్బులు పడ్డయి. బర్రెల యూనిట్ పెట్టుకున్నా. నాలాంటి పేదవాళ్లకు బర్రెలు వస్తే వాటిని పెంచుకుంటూ కుటుంబాన్ని బాగు చేసుకుంటరని అనుకున్నా. నోటికాడి బుక్కను లాగేసినట్టు పథకాన్ని ఆపివేయించడం కరెక్ట్ కాదు. వాళ్లు పెట్టరు పెట్టే కేసీఆర్ను పెట్టనివ్వరు. బీజేపీకి గుణపాఠం తప్పదు. తరిమికొడుతం – బరిగెల రవి ఉప్పల్, (కమలాపూర్)
బీజేపీ కుట్ర బయటపడింది..
ఇయ్యాల వార్త జూత్తే బీజేపీ కుట్ర బయటపడింది. ఈటల రాజేందర్ మొదట్నుంచి ప్రభుత్వ పథకాలను విమర్శిత్తండు. దళిత బంధునుగూడ ఆపాలని జూసిండు. ఎన్నికల కమిషన్ వాళ్లకు లేఖ రాయించిండు. దళిత బంధును అచ్చే నెల 19 వరకు ఆపాలని ఒక కుట్ర పన్నిండు. దళితుల మీద నీకెందుకు కుట్ర ఈటల.. చెప్పాలే. బీజేపీ నాయకుల్లారా.. ఖబడ్దార్. మీ కుట్రలన్నీ మాకు తెల్తానయ్. ఇవ్వారకే దళిత వ్యతిరేక పార్టీలో ఉన్నదేగాకుండా.. మా ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు ఇత్తే వ్యతిరేకిస్తవా..? ఆపుతవా..? జాప్యం చేయిస్తవా..? సరే. నీ మతతత్వ పార్టీని మా వాడల అడుగు పెట్టనియ్యం. కచ్చితంగా మా దళిత జాతంతా ఏకమైతం. ఓటు కోసం మా దగ్గరికత్తే తరిమికొడతం. ఏ విధంగా దళిత బంధును లబ్ధి పొందాలో మాకు తెలుసు. మీ కుట్రలను తిప్పికొడ్తం. వాడలల్ల తగిన గుణపాఠం చెబుతం.
దళితులంటేనే ఈటలకు నచ్చదు..
దళితులంటేనే ఈటలకు నచ్చదు. ఎదగనీయడు. ఇంకా బీజేపీలో చేరిండు. ఆ పార్టీ అసోంటిదే. ఎన్నో రాష్ర్టాలల్ల దళితులను అణగదొక్కుతంది. ఉసురు తీస్తంది. మేం బాగుపడాల్నని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తెస్తే రాజేందర్ పెద్ద కుట్రనే చేసిండు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించిండు. ఆయనతో అయ్యేది లేదు.. పోయేది లేదు. ఓటమి ఎప్పుడో ఖాయమైంది. ఏదో చేయాల్నని దళిత బంధును ఆపించిండు. మేం ఊకుంటమా..? మా తడాఖా ఎంటో చూపిస్తం. బీజేపీని బొందపెడతం. అన్నివిధాలా అండగా ఉంటున్న టీఆర్ఎస్తోనే ఉంటం.
దళితుల గొంతుకోస్తున్న ఈటల..
ఈటల రాజేందర్ తన ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలో చేరిండు. గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నడు. ఎక్కడ ఓడిపోతాననే భయంతో అదే బీజేపీని అడ్డుపెట్టుకొని దళితుల గొంతుకోయడం ఎంతవరకు కరెక్ట్. మేమే దొరికినమా. అణగారిన మా బతుకుల్లో వెలుగులు నింపేందుకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు తెస్తే బీజేపీ కండ్లుమండించుకుంటున్నది. ఎలాగైనా ఆపాలని మొదటి నుంచే అనుకుంటున్నది. ఇయ్యాల చేసింది. దళిత బంధును ఆపింది. ఓట్లు వేసి గెలిపించిన దళితులపై రాజేందర్కు ఎంత ప్రేమ ఉన్నదో యావత్ దళిత జాతి గమనిస్తున్నది. కడుపుల కత్తులు పెట్టుకొని కపట ప్రేమ చూపిస్తున్న ఈటల రాజేందర్కు దళిత ప్రజలు తగిన గుణపాఠం చెబుతరు. ఆనాడూ దళితుల నుంచి లాక్కున్న భూములు కాపాడుకోవడానికి ఈటల బీజేపీలో చేరిండు. ఇవ్వాల హుజూరాబాద్ ఎన్నికలో ఓడిపోతాననే భయంతో దళిత బంధును ఆపిండు.