జిల్లాల్లో తగ్గిపోయిన వాయిల్స్ నిల్వలు
సరఫరా లేక సెంటర్ల సంఖ్య కుదింపు
నెమ్మదించిన వ్యాక్సినేషన్
గురువారం 3,500 మందికే వ్యాక్సిన్
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో మధ్యాహ్నం తర్వాత నిలిపివేత
సిబ్బందిని నిలదీసిన జనం
సప్లయ్ లేదన్న అధికారులు
కేంద్రం వైఖరిపై ప్రజల్లో అసహనం
కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ సెంటర్లకు జనం పోటెత్తుతున్నారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం, అందరిలో అవగాహన పెరగడంతో క్యూ కడుతున్నారు. మొదట్లో వ్యాక్సిన్ సప్లయ్ బాగానే ఉండడంతో ఈ నెల 21 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 135 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 10వేలకుపైగా మందికి టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత జనం పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఒక్కసారిగా వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచారు. వారం క్రితం వరకు 238 సెంటర్లలో రోజువారీగా సగటున 35వేల మందికిపైనే టీకాలు ఇచ్చారు. క్రమంగా వ్యాక్సిన్ సప్లయ్ తగ్గడంతో మూడు రోజుల నుంచి సెంటర్లను తగ్గిస్తూ వచ్చారు. గురువారం చూస్తే 51 సెంటర్లలో 3411 మందికి మాత్రమే టీకాలు వేశారు. ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. శుక్రవారం ఉదయం వరకు వస్తేనే తిరిగి వ్యాక్సినేషన్ కొనసాగే పరిస్థితి ఉన్నది.
కరీంనగర్లో వ్యాక్సిన్లు లేక నిలదీత..
వారం క్రితం వరకు ఒక్క కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 72 సెంటర్లలో రోజువారీగా 12 వేల నుంచి 15వేల మందికి వ్యాక్సిన్ చేశారు. ఈ నెల 23న ఒక్కరోజే 15,456 మందికి టీకాలు వేశారు. వాయిల్స్ సరఫరా లేక బుధవారం 28 సెంటర్లలో 6,013 మందికి, గురువారం 6 సెంటర్లలో 1,200 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే మొన్నటిదాకా పెద్ద ఎత్తున ఇవ్వడంతో అన్ని సెంటర్లకు జనం బారులు తీరుతున్నారు. గురువారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు 500 మందికిపైగా వచ్చారు. మధ్యాహ్నం వరకు 285 మందికి మాత్రమే టీకాలు వేశారు. మిగతా వారంతా క్యూలో ఉండగా, అప్పటికే వాయిల్స్ అయిపోయాయి. ఈ విషయం వారికి తెలియడంతో వైద్య సిబ్బందిని నిలదీశారు. పనులన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చామని, తీరా ఇక్కడ వస్తే టీకాలు లేవని వెళ్లగొడుతున్నారని వాపోయారు. వాక్సిన్ అయిపోయిందని, మిగతా వారికి శుక్రవారం ఇస్తామని అధికారులు చెప్పి నా జనం అక్కడి నుంచి వెళ్ల లేదు. దీంతో దవాఖాన అధికారులు వాయిల్స్ కోసం ప్రయత్నించారు. ఎక్కడైనా ఉంటే తెప్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఎక్కడా వాక్సిన్ నిల్వ లు లేక పోవడంతో సిబ్బంది చేతులెత్తేశారు. తీవ్ర నిరాశతో జనం ఇంటి దారిపట్టారు.
డిమాండ్కు తగ్గ సప్లయ్ ఏదీ..?
కరీంనగర్ జిల్లాలో 45 ఏండ్లు దాటిన వాళ్లు 2.44 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 1.10 లక్షల మంది వరకు టీకాలు ఇచ్చారు. ఈ వయసు వాళ్లకు వ్యాక్సినేషన్ పూర్తి కాక ముందే 18 నుంచి 44 ఏండ్ల వారికి కూడా టీకాలు వేయాలని కేంద్రం ప్రకటించింది. టీకా ఖర్చు రాష్ర్టాలే భరించాలని కూడా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం అందుకు కూడా సిద్ధపడింది. అయితే 45 ఏండ్లు దాటిన వారికే సరిగ్గా వ్యాక్సినేషన్ చేయలేని కేంద్రం, వచ్చే నెల ఒకటి నుంచి 18 నుంచి 44 ఏండ్ల వారికి ఏ విధంగా టీకాలు వేస్తుందనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఇదే విషయమై కొందరు మహిళలు గురువారం కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన సిబ్బందిని నిలదీయడం చర్చనీయాశంమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో టీకాలు వేసిన 6 సెంటర్లలో ఇలాంటి పరిస్థితే నెలకొనడతో అధికారులు సైతం తలలు పట్టుకున్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కేటాయిస్తే తప్పా టీకాలు వేసే పరిస్థితి లేదని ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు.