హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 3: ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో కౌన్సిలర్, టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, 17వ వార్డులో కౌన్సిలర్ ఉజ్మానూరిన్, ఆ వార్డు ఇన్చార్జి, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ జమీలొద్దీన్, 23వ వార్డులో కౌన్సిలర్ సృజనాపూర్ణచందర్, వార్డు ఇన్చార్జి అడ్డగట్ల శేఖర్, కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. పట్టణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులు, వాటితో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అలాగే రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తదితర పథకాలతో అన్ని వర్గాలకు కలుగుతున్న మేలును గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని చెప్పారు. అయినా బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నదని, దీనిని నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ప్రజల మద్దతు టీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ఖాన్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు బీఎస్ ఇమ్రాన్, నాయకులు ఉప్పు శ్రీనివాస్, కల్లెపల్లి రోషేందర్, కావేరి, తిరుపతి, దుర్గాప్రసాద్, పృథ్వీరాజ్, కాలువ శ్రీను తదితరులు పాల్గొన్నారు.