త్రిప్టు పథకానికి రూ.30 కోట్లు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి సోమవారం అధికారులంతా నేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చి చేనేతకు చేయూతనిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ వీవర్స్ థ్రిప్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్(టీఎఫ్ఎస్ఎస్)ను 2017లో ప్రవేశపెట్టింది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయించారు. సంపాదించిన కూలీలో చేనేత కార్మికుడి వాటా 8 శాతం కాగా, ప్రభుత్వం 16 శాతం, మరమగ్గాల కార్మికుడికి 8 శాతం వాటా కాగా, ప్రభుత్వం 8 శాతం పొదుపు పథకానికి చెల్లిస్తున్నది. అయితే, మరమగ్గాల కార్మికులు విద్యుత్తో సాంచాలు నడిపించి ఎక్కువ కూలీ పొందుతుండగా, చేనేత కార్మికులు పొద్దంతా కష్టపడ్డా మరమగ్గాల కార్మికుడు సంపాదించిన కూలీలో సగం కూడా పొందడం లేదు. అందుకే ప్రభుత్వం వారికి రెండింతలు జమచేసి చేయూతనిస్తున్నది.
వస్త్ర పరిశ్రమకు ప్రోత్సాహం
వ్యవసాయ రంగంతో పాటు వస్త్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభు త్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కార్మికుడిని యజమాని చేయాలన్న ఉద్దేశంతో వర్కర్టూ ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల తయారీకి ఇప్పటి వరకు రూ.2000 కోట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చింది. చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం సంపాదిస్తున్న కార్మికులకు పొదుపు (త్రిప్టు) పథకాన్ని ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నది. పథకం ప్రవేశపెట్టిన తర్వాత కార్మికులకు రెండేళ్లకే జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ఇందులో సిరిసిల్లలో 2000 మరమగ్గాల, చేనేత కార్మికులకు రూ.5 కోట్లు చెల్లించగా, కరీంనగర్ పరిధిలోని చేనేత కార్మికులు జమచేసిన రూ.రెండున్నర రోట్లకు రూ.4.19 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
తాజాగా రూ.30 కోట్లు విడుదల
త్రిప్టు పథకాన్ని రాష్ట్రంలో 2017లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సర్కారు అప్పుడు రూ.12 కోట్లు కేటాయించింది. పొదుపు పథకం పకడ్బందీగా అమలయ్యేలా చేనేత జౌళి శాఖకు అప్పగించింది. మూడేళ్ల కిందట పథకం ప్రారంభించగా, రెండేండ్ల తర్వాత కరోనా రావడం, లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు బంద్ అయ్యాయి. ఫలితంగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. కార్మికులు జమ చేసిన నగదుతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు మూడేండ్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లకే తిరిగి చెల్లించి వారి కుటుంబాలకు చేయూతనిచ్చింది. 2021లో ముగిసిన ఈ పథకాన్ని తిరిగి జూన్ నెలలో ప్రారంభించింది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులందరినీ ఈ పథకంలో చేర్పించాలని చేనేత జౌళిశాఖ అధికారులను ఆదేశించారు. గతంలో రూ.12 కోట్లతో ప్రారంభించిన ఈ పథకానికి ఈ ఏడాది రూ.30 కోట్లు విడుదల చేయించారు.
17,741 మందికి లబ్ధి
త్రిఫ్టు పథకంతో ఈసారి ఉమ్మడి జిల్లాలో 15,916 మంది మరమగ్గాల, 1,825 మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగనున్నది. ప్రస్తుతం చేనేత కార్మికులు రాజన్న సిరిసిల్లలో 236 మంది ఉండగా, జగిత్యాలలో 15, కరీంనగర్లో 1445, పెద్దపల్లిలో 129 మంది చొప్పున ఉన్నారు. మరమగ్గాల కార్మికులు సిరిసిల్లలో 15 వేల మంది ఉండగా మిగిలిన మూడు జిల్లాలు కలిపి 916 మంది ఉన్నారు. వీరందరినీ చేయూత పథకంలో భాగస్వామ్యం చేసి పొదుపు పథకం పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అందరికీ వర్తింపజేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా త్రిఫ్ట్ పథకం ప్రవేశపెట్టింది. మూడేళ్ల గడువు ఉన్న పొదుపు పథకంలో 8 శాతం చేనేత కార్మికుడు చెల్లిస్తే 16 శాతం ప్రభుత్వం ఇస్తుంది. మరమగ్గాల కార్మికుడు 8 శాతం కడితే మరో 8 శాతం ప్రభుత్వం జమచేస్తుంది. ఇలా గరిష్టంగా నెలకు రూ.1200లు ఇస్తుంది. ఈ పథకం ఈ ఏడాది నుంచి పునః ప్రారంభిస్తున్నందున కార్మికులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సర్వే చేస్తున్నాం
చేనేత, మరమగ్గాల కార్మికుల సర్వే చేస్తున్నాం. ప్రస్తుతం చేనేత కార్మికులు కరీంనగర్ జిల్లాలో 1445, పెద్దపల్లిలో 129, జగిత్యాలలో 15 మంది, మరమగ్గాల కార్మికులు మూడు జిల్లాల పరిధిలో 916 మంది ఉన్నారు. వీరందరిని త్రిప్టు పథకంలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీరిని మూడేళ్ల క్రితం త్రిప్టులో చేర్పించాం. కరోనా కష్టకాలంలో ముందస్తుగా డబ్బులు ఇచ్చి ప్రభుత్వం అండగా నిలిచింది.
పొదుపు పైసలతో బిడ్డ పెళ్లి చేసిన
సర్కారు ప్రవేశపెట్టిన పొథకం చాలా మంచిగున్నది. నాకొచ్చే పగారలో నెలకు రూ.1200ల చొప్పున బ్యాంకులో జమచేసుకున్న. సర్కారు మరో రూ.1200లు కలిపింది. డెండేళ్లకు రూ.30 వేలకు రూ.60 వేలు ఇచ్చిండ్రు. ఆపైసలతోనే చిన్న బిడ్డ పెళ్లిజేసిన. మళ్లీ మొదలైన ఈ పథకంల ఇప్పుడు రెండింతలు జమ చేస్త. కేటీఆర్ దయవల్ల మా బతుకులకు భరోసా కలిగింది.