పక్కా పథకం ప్రకారమే ఎస్బీఐలోచోరీ
ఘటనలో 9 మంది సభ్యుల ముఠా
ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
20 తులాల బంగారం రికవరీ
ఫర్టిలైజర్సిటీ, మే 4 : ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆరుగురు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. బ్యాంకుల్లో భారీ చోరీ చేయాలని టార్గెట్గా పెట్టుకుని, గూగుల్లో సెర్చ్చేసి వివరాలు సేకరించారు. ముందుగా మహారాష్ట్రలోని ఓ బ్యాంకులో చోరీ చేశారు. ఆ తర్వాత మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐని ఎంచుకుని పక్కా ప్లాన్తో దాదాపు రూ.3కోట్లు కొల్లగొట్టారు. ఈ ముఠాలోని ఓ సభ్యుడిని రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. అతడి నుంచి 20 తులాల బంగారం రికవరీ చేశారు.
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐలో జరిగిన భారీ చోరీ కేసులో రామగుండం కమిషనరేట్ పోలీసులు పురోగతి సాధించారు. ఆ చోరీకి సంబంధించి ముఠాలోని ఒక సభ్యుడిని మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బ్యాంకులో సుమారు 6 కిలోల బంగారం, 18 లక్షల నగదు చోరీ జరగగా, బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ పింగ్వ ఫిర్యాదు మేరకు మార్చి 25న మంథని పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ దర్యాప్తు అధికారిగా బాధ్యతలు స్వీకరించి, చోరీ చేసింది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగేనని నిర్ధారణ చేశారు. ఆ నేపథ్యంలో మహారాష్ట్రలోనూ బ్యాంకు దొంగతనాలు జరిగినట్లు తెలుసుకున్నారు. వెంట నే ముగ్గురు పోలీస్ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో మూ డు టీంలను తయారు చేసి ఒక టీంను మహారా ష్ట్ర, రెండు టీంలను యూపీకి పంపించారు. అదే సమయంలో మహారాష్ట్ర బ్యాంకు దొంగతనాలకు సంబంధించి అక్కడి పోలీసులు అదే రాష్ర్టానికి చెందిన ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వా రు ఇచ్చిన సమాచారం మేరకు యూపీకి చెందిన ఇద్దరు ముఠా సభ్యులను అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. వారి నుంచి గుంజపడుగు ఎస్బీఐ బ్యాం కుకు చెందిన కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీన పర్చుకున్నారు. అనంతరం దొంగలను విచారించ గా వారు మొత్తం 9 మంది సభ్యులని, మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రా మగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు బృం దాలు కక్రాల గ్రామంలో చుట్టు పక్కల ప్రాంతా ల్లో నెల రోజుల నుంచి గాలించారు.
టీం సభ్యుడు ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేందర్కు వచ్చిన సమాచారం ఆధారంగా ముఠాలోని ఒక సభ్యుడైన ఆదేశ్ శర్మను యూపీలో పట్టుకున్నారు. అతనిని ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి చోరీ సొత్తు సుమారు 20 తులాల బంగారం రికవరీ చేశారు. పంచనామా అనంతరం యూపీలోని లో కల్ మెజిస్ట్రేట్ ముందు నిందితుడిని, చోరీ సొత్తు ను చూపించారు. ట్రాన్సిట్ వారెంట్పై అతనిని తీసుకొని మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు.
నిందితుల వివరాలు
బ్యాంకు చోరీ కేసులో ఆదేశ్ శర్మ యూపీలోని బదాయు జిల్లా హురియ తాలూక హసన్పూర్ గ్రామానికి చెందిన వాడు కాగా, మహారాష్ట్ర పోలీసుల అదుపులో నవాబుల్ హసన్ (యూపీ), దాన్వీర్(యూపీ), రాజు వసంత రావు (మహారాష్ట్ర), దేవదాస్ రూప్ చాంద్ (మహారాష్ట్ర), సంకేత్ తేజ్ రామ్ (మహారాష్ట్ర) ఉన్నారు. అలాగే పరారీలో నవాబ్, నాసర్ అలీ, జహంగీర్ ఉన్నారు.
పక్కా ప్లాన్తో..
యూపీకి చెందిన నవాబుల్ హసన్, దాన్వీర్, ఆదేశ్ శర్మ, గుడ్డు, భూరే, జహంగీర్, మహారాష్ట్రలోని రాజు వసంతరావు, దేవదాస్ రూప్ చాండ్, సంకేత్ తేజ్ రామ్తో కలిసి చంద్రాపూర్ జిల్లా ఎంఐడీసీ ఇండస్ట్రీయల్ ఏరియాలోని రాజు వసంతరావు వార్బే ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. అక్కడే సుమారు 15 రోజుల పాటు ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఒక వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్, రెగ్యులరేటర్, గ్యాస్ కట్టర్ను దొంగిలించారు. ఆ తర్వాత ఒక పథకం ప్రకారం హైవేపై ఉండే బ్యాంకులను టార్గెట్ చేసుకొని వాటిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రాపూర్ జిల్లా వరోరా పోలీస్స్టేషన్ పరిధిలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో దొంగతనం చేశారు. అంతకంటే ముందు మహారాష్ట్రలోని పలు ఏటీఎంలలో దొంగతనాలు చేశారు. మార్చి 22న బొలెరో వాహనంలో చంద్రాపూర్ నుంచి బయలుదేరారు. గుడ్డు అనే వ్యక్తి సెల్ఫోన్లో బ్యాంకు లొకేషన్ సెర్చ్ చేసి నేషనల్ హైవే కాకుండా నైట్ హైవేలో రోడ్కు దగ్గరలో ఉన్న బ్యాంకులను సెర్చ్ చేయగా, గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు లొకేట్ అయింది. దీని ఆధారంగా మంథని మండలం గుంజపడుగును రెక్కీ చేసి మళ్లీ తిరిగి వెళ్లిపోయారు. మార్చి 24న తొమ్మిది మంది కలిసి చంద్రాపూర్ నుంచి బొలెరో వాహనంలో దొంగతనం చేయడానికి కావల్సిన గ్యాస్ సిలిండర్, కట్టర్, ఇతర సామగ్రి తోటి బయలుదేరారు. మార్యమధ్యంలో లంచ్ చేసి చీకటి పడేవారకు ఆగారు.
ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో మొబైల్ ఫోన్ ద్వారా జీపీఎస్ సహాయంతో వచ్చారు. ఏడుగురు నవాబుల్ హసన్, దాన్వీర్, ఆదేశ్ శర్మ, గుడ్డు భూరే, జంగీర్, సంకేత్లు దిగి బ్యాంకు దగ్గర దిగారు. మిగిలిన ఇద్దరు దేవదాస్, రాజు బొలెరో వాహనాన్ని తీస్కొని దూరంగా వేచి ఉన్నారు. ఆదేశ్ శర్మ, నవాబుల్ గ్యాస్ సిలిండర్ను భుజాలపై మోసుకుంటూ కొద్ది దూరం నడుచుకొని వెళ్లి బ్యాంకు వెనుక స్థలంలో మాటు వేశారు. మిగిలిన వాళ్లు బ్యాంకు వెనుక చేరుకున్నారు. ఆ సమయంలో బ్యాంకు గోడ ఎక్కడానికి వీలుగా అక్కడ ఉన్న ఎండు కట్టెలతో నవాబుల్ హసన్, గుడ్డు కలిసి ఒక నిచ్చెన తయారు చేశారు. రాత్రి 12 గంట.లకు నవాబుల్ హసన్, దాన్వీర్, గుడ్డు ముగ్గురు బ్యాంకు వెనుకాల కిటికీ తలుపులు పగులగొట్టి గ్రిల్స్ తొలగించి లోపల ప్రవేశించారు. మిగతా వ్యక్తులు వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ను లోపల అందించారు. లోపల సీసీ కెమెరా వైర్లు కట్ చేసి ఎలక్ట్రిక్ అలారాన్ని కట్ చేశారు. స్ట్రాంగ్ రూం తాళం పగులగొట్టి లోపలకి ప్రవేశించారు. క్యాష్ లాకర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి, అందులోని 18 లక్షల నగదు, 6 కిలోల బంగారం తీసుకొని సంచిలో వేసుకొని 2 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. బ్యాంకు నుంచి తెచ్చిన సీసీ టీవీ, డీవీఆర్ అక్కడ పొలాల్లో పారేశారు. బ్యాంకు వెనుక కొద్ది దూరంలో చెట్లలో వెయిట్ చేసి, 4.30 గంటలకు బొలెరో వాహనంలో చంద్రాపూర్ ఎంఐడీసీలోని రాజు ఇంటికి వెళ్లారు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని టిఫిన్ చేసి తర్వాత చోరీ చేసిన దోచుకున్న బంగారం, నగదును తొమ్మిది మంది పంచుకున్నారు. ఆ తర్వాత యూపీకి చెందిన ఆరుగురు బస్సు ద్వారా యూపీకి వెళ్లిపోయారు. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతుందనీ, రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు నిందితులను కూడా పీటీ వారెంట్పై తీసుకొని మంథని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు.
శెభాష్ శరత్ చంద్ర
గుంజపడుగు ఎస్బీఐ బ్యాంక్ చోరీ కేసును ఛేదించడంలో కీలకపాత్ర వహించిన రామగుం డం ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ను రామగుండం సీపీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. నేరం సం ఘటన జరిగిన అనంతరం ఓఎస్డీ శరత్ చంద్రకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరిగిందనీ, నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన వివిధ టీంలకు ఆయన నాయకత్వం వహించడంతోపాటు సాంకేతిక విశ్లేషణ, యూపీలోని పలు ప్రాంతాలపై నిందితులను పట్టుకోవడం కోసం రైడింగ్ చేయడంలో శరత్ చంద్ర కీలకంగా వ్యవహరించారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ ఉమెందర్ను యూపీలో నెల రోజులు కష్టపడి నిందితున్ని పట్టుకున్న పోలీస్ బృందంను రామగుండం సీపీ సత్యనారాయణ అభినందించారు.