హుజూరాబాద్, అక్టోబర్ 18: ఎన్నికను అడ్డుపెట్టుకొని దళితబంధు పథకాన్ని నిలిపివేసి దళిత సమాజానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని, మరీ ఇన్ని కుట్రలా..? అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితబంధు పథకంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. బీజేపీ నేతలు ఈటల, గోనె ప్రకాశ్రావు, పద్మనాభరెడ్డి, ప్రేమేందర్రెడ్డి దళితబంధు ఆపాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారని చెబుతూనే, వాటికి సంబంధించిన ఆధారాలను విలేకరుల సమావేశంలో బయటపెట్టారు. ఈ లేఖల ఆధారంగానే దళిత బంధును ఈసీ నిలిపివేసిందని చెప్పారు. బీజేపీవాళ్లే ఫిర్యాదు చేసి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే దళితబంధు ఆగిపోయిందని మాట్లాడడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. దొంగే దొంగ అన్నట్లుగా వారి వ్యవహారం ఉందని, దళిత సమాజానికి ద్రోహం చేసిన బీజేపీకి దళితులంతా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక పథకం ఎన్నికల ముందే ప్రారంభమై కొనసాగుతుంటే ఆ పథకాన్ని ఆపాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా జరిగిందన్నారు. దళితబంధు పూర్తి స్థాయిలో అమలైతే ఓడిపోతారనే భయంతో లేఖ రాసే నిర్ణయం రాజేందర్తో సహా ఆ పార్టీ నాయకులు తీసుకున్నారని మండిపడ్డారు.
దళిత వ్యతిరేకి బీజేపీ: విప్ బాల్క సుమన్
బీజేపీ అంటేనే దళిత వ్యతిరేఖి అని విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ‘రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర సర్కారు దళితబంధుకు శ్రీకారం చుట్టింది. దళితులందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారని, ఎలాగైనా దళితబంధును ఆపాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత జాతి బీజేపీ నేతలను క్షమించదు. ఓట్లు అడగడానికి దళితవాడలకు బీజేపీ నాయకులు ఎలా వస్తారో చూస్తాం. బీజేపీ చేసిన ద్రోహానికి దళితులు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. పథకాన్ని మరో 12రోజులు మాత్రమే ఆపుతారే తప్ప అంతకు మించి ఏమి చేయలేరు. దళితుల భూములు గుంజుకున్న ఈటల ఇప్పుడు దళితబంధు ఆపి వేశాడని’ దుయ్యబట్టారు.
రాజేందర్ ఏం సమాధానం చెబుతాడు: విప్ బాలరాజు
రాజేందర్తో సహా బీజేపీ నేతలు ఈసీకి లేఖ రాసి దళితబంధును నిలిపివేయించారని తమ వద్ద ఆధారాలున్నాయని, దీనికి ఈటల ఏం సమాధానం చెబుతాడని విప్ బాలరాజు ప్రశ్నించారు. ‘ఇప్పటికే 17వేల దళితుల కుటుంబాల అకౌంట్లో డబ్బులు జమయ్యాయి. దళితులపై బీజేపీ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారు. ఓ పక్క రాష్ట్రం మొత్తం దళితబంధు ప్రవేశపెట్టాలని సన్నాయినొక్కులు నొక్కుతూనే మరో పక్క దళితబంధును ఆపాలని కేంద్రానికి లేఖ రాయడం వారికే చెల్లిందని’ దుయ్యబట్టారు. బీజేపీ అంటేనే ఒక బోగస్ పార్టీ అని, ఓట్ల కోసం వచ్చే నాయకులను దళిత వాడల్లో నిలదీయాలని, పథకాన్ని ఎందుకు ఆపారో ప్రశ్నించాలని కోరారు.
ఎన్ని కుట్రలు చేసినా దళితబంధు ఆగదు: ఎమ్మెల్యే సుంకె
బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా దళితబంధు ఆగదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 17వేల దళిత కుటుంబాల్లో డబ్బులు జమ కాగా, చాలా యూనిట్లు గ్రౌండింగయ్యాయని చెప్పారు. ఈ తరుణంలో దళితబంధు ఆపివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక బీజేపీ అసలు రంగు బయటపడిందని చెప్పారు. ఉప ఎన్నికలో దళితులు రాజేందర్ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు మాదిరిగా కేంద్రంలో ఓ పథకం పెట్టి దళితులను ఆదుకోవాలి.
దళితులు ధైర్యంగా ఉండాలి: ఎమ్మెల్యే రమేశ్
మొదటి నుంచి దళితబంధు పథకంపై లేనిపోని అపోహాలను బీజేపోళ్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ మండిపడ్డారు. మొదట దళితబంధు పథకం అంతా ఉత్తదేనని, ఎన్నికల కోసమే ప్రవేశపెడుతున్నారని మాట్లాడారని, అకౌంట్లలో డబ్బులు పడ్డ తర్వాత పాస్బుక్కులు రాలేదని, డబ్బులు వాపస్ పోతున్నాయని అయోమయ పడేలా మాట్లాడారని మండిపడ్డారు. అంతా సక్రమంగా కొనసాగుతున్న సమయంలో ఎలాగైనా ఆపాలని కుట్రలు పన్ని ఈసీకి లేఖ రాశారని దుయ్యబట్టారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్పై నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.
దళితుల వాడలకు వస్తే తరిమికొట్టాలి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
బీజేపీ నాయకులు ఓట్ల కోసం దళితుల వాడలకు వస్తే తరిమికొట్టాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ మొదటి నుంచి దళితుల పట్ల మోసపూరితంగా ప్రవర్తిస్తున్నదని, దళితబంధును ఆపేందుకు కుట్ర చేసిందని మండిపడ్డారు. ‘నోటికాడి బుక్కను లాక్కొనే విధంగా వ్యవహరించడం నీచమైన చర్య. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి ఈటల రాజేందర్, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. దళితులందరు ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్పాలి. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధు లెక్క కేంద్రంలో ఓ పథకం పెట్టి దళితులను ఓట్లు అడుక్కోవాలి.