హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, జూలై 28: బీజేపీ నేత ఈటలకు చిత్తశుద్ధి లేదని, అభివృద్ధిని.. ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఆయన నిర్లక్ష్యంతోనే హుజూరాబాద్ పట్టణం ఎటు చూసినా దుమ్ముధూళితో నిండిపోయిందని, రోడ్లన్నీ గుంతలమయంగా మారి నడిచే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇన్నేండ్ల పాలనలో ఆయన చేసింది శూన్యమని దుయ్యబట్టారు. అభివృద్ధిని పట్టించుకోనోడు.. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలు నిలదీయాలని కోరారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో 35.52కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఆటోనగర్కు కేటాయించిన 7.5 ఎకరాల స్థలంలో కేసీఆర్ ఆటోనగర్గా నామకరణ బోర్డుకు భూమి పూజ చేయగా, మంత్రులు కొప్పుల, తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. ప్రజల కష్టాలు తీర్చడమే మా బాధ్యత అని ఉద్ఘాటించారు. పట్టణంలో 120 చిన్న, పెద్ద రోడ్లతో పాటు పలు చోట్ల మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఒకేసారి అంతటా పనులు మొదలుపెట్టి 20రోజుల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఈటల హయాంలో వెనుకబడ్డ హుజూరాబాద్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయని, నియోజకవర్గ ప్రగతికి సీఎం కేసీఆర్ నిధులు లేవనకుండా ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు కండ్లకు కనిపిస్తుంటే, హుజూరాబాద్ వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని చెప్పారు. పలు కుల సంఘాల భవనాల కోసం స్థలం కావాలని ఈటలను అడిగినా పట్టించుకోలేదని, స్థలం లేదంటూ దాటవేశారని ఆక్షేపించారు. 20 ఏండ్లుగా దొరకని స్థలం ఇప్పుడు ఎకడి నుంచి వచ్చిందని.. తామేమన్నా కరీంనగర్ నుంచి స్థలాన్ని తెచ్చామా..? ఆయనకు చిత్తశుద్ధి లేకనే ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి ప్రజలపై కేసీఆర్కు ప్రేమ ఉండడంతో పాటు ఇవ్వాలనే సంకల్పం ఉండడంతో స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. తాము చేపట్టే ఈ కార్యక్రమాలు కేవలం ఓట్ల కోసం కాదని, ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఒరిగేదేం లేదని స్పష్టం చేశారు. అయితే టీఆర్ఎస్ గెలిస్తేనే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతం చుట్టు పకల నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఈటల నిర్లక్ష్యంతోనే హుజూరాబాద్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని దుయ్యబట్టారు.
కేసీఆర్ ఆటోనగర్కు బోర్డుకు పూజ
ఆటోనగర్ ఏర్పాటు కోసం పట్టణంలో కరీంనగర్ రహదారిలో కాకతీయ కాలువ పక్కన 7.5 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, అక్కడ మెకానిక్లు నిర్వహించిన కేసీఆర్ ఆటోనగర్ బోర్డుకు భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులకు మెకానిక్లు ఘన స్వాగతం పలికారు. పటాకలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం మంత్రులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గతంలో పట్టణానికి చెందిన మెకానిక్లు ఆటోనగర్ కోసం స్థలం కేటాయించాలని ఈటలకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇటీవల మెకానిక్లు అందరూ కలిసి స్థలం కావాలని కోరగా, వెంటనే సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన పచ్చజెండా ఊపి స్థలం కేటాయించారని చెప్పారు. దీనికి కృతజ్ఞతగా ఆటోనగర్కు మెకానిక్లు అందరూ కలిసి కేసీఆర్ ఆటోనగర్గా నామకరణం చేశారని చెప్పారు. సందర్భంగా మంత్రులను మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి గంగులకు మెకానిక్లు ఘన స్వాగతం పలికి, బైక్ ర్యాలీ తీశారు. స్వయంగా గంగుల కమలాకర్ బైక్ నడిపి ఉత్సాహం నింపారు.
ఇక్కడి నుంచే దళిత బంధు కార్యక్రమం..
సీఎం కేసీఆర్కు కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని అభిమానమని, అందుకోసమే రైతు బంధును హుజూరాబాద్లో ప్రారంభించారని, ఇప్పుడు మరో అద్భుతమైన పథకం దళిత బంధుకూ ఇక్కడి నుంచే అంకురార్పణ చేయబోతున్నారని మంత్రి గంగుల పేర్కొన్నారు. అభివృద్ధి చేసినవాళ్లకే పట్టం కట్టాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అభ్యర్థి ఎవరైనా, సీఎం కేసీఆర్ సూచించిన వ్యక్తికే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్కు హుజూరాబాద్ కంచుకోట అనే నామాన్ని మరోసారి సార్థకం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కరీంనగర్ మేయర్ సునీల్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కేసీరెడ్డి లావణ్య, కళ్లెపెల్లి రమాదేవి, తోట రాజేంద్రప్రసాద్, దండ శోభ, నాయకులు కొలిపాక శ్రీనివాస్, గందె శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.