హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 3: బీజేపీ నేత ఈటల రాజేందర్ కొత్త డ్రామాకు తెరతీస్తున్నాడని, ఉప ఎన్నికలో ఓటమి భయంతో మోకాలికి ఆపరేషన్ పేరిట వీల్చైర్ నాటకం ఆడేందుకు సిద్ధమవుతున్నాడని ఈటల దళిత బాధితుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ఆరోపించారు. హుజూరాబాద్లోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈటల రాజేందర్ కేవలం 12 రోజులు 222 కిలోమీటర్లు అత్యంత ఖరీదైన బూట్లు ధరించి, లగ్జరీ బస్సులో నిద్రిస్తూ విలాసవంతమైన రాత్రులు గడిపితే ఎలా అస్వస్థతకు గురయ్యాడో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాటకాలను స్ఫూర్తిగా తీసుకొని హుజూరాబాద్లో ఈటల కొత్త డ్రామాకు తెరలేపబోతున్నాడని మండిపడ్డారు. సంబంధం లేని విషయాలతో ప్రజలను మోసగిస్తున్న తీరును కొన్ని సాక్ష్యాలతో విలేకరులకు వివరించారు. గత నెల 31 వరకు 12 రోజులు 222 కిలోమీటర్లు నడిచిన ఈటల కొండపాకలో అస్వస్థతకు గురైనట్లు వైద్యులు, ఆయన సతీమణి జమునారెడ్డి విలేకరులకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే వైద్యం చేసుకొని రెండు రోజుల తర్వాత యాత్ర కొనసాగిస్తానని ఈటల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, మళ్లీ తెల్లవారు జామున ఆగస్టు ఒకటిన ఉదయం నిమ్స్ హాస్పిటల్లో చేర్పించారని, అక్కడి నుంచి మళ్లీ అపోలో హాస్పిటల్కి తరలించినట్లు చెప్పారని వివరించారు. ఆగస్టు 1, 2వ తేదీల్లో ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజేపీ నాయకులు, వైద్యులు చెప్పారని, కానీ రాత్రి మరో నాటకానికి తెరలేపి మోకాలికి ఆపరేషన్ అయినట్లు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు నమ్మొద్దని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సంపత్ సూచించారు. ఈ సమావేశంలో ఈటల దళిత బాధితుల సంఘం ఉపాధ్యక్షుడు మేకల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నమిండ్ల రాజేశ్వర్, అధికార ప్రతినిధి కదిరే రమేశ్, కార్యదర్శి దాట్లా ప్రవీణ్, సహాయ కార్యదర్శి చల్లురి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.