హుజూరాబాద్, సెప్టెంబర్ 28 : ఆత్మగౌరవం అనే పదం వాడే అర్హత బీజేపీ నేత ఈటల రాజేందర్కు లేదని, అసలుసిసలైన ఆత్మగౌరవానికి ప్రతీక సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపెల్లి కిషన్రావు పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీసెంటర్హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడుకు, కూతురుకు రెడ్డి వర్గం నుంచే సంబంధాలు కలుపుకోవడంతో బీసీనని చెప్పుకొనే అర్హత ఈటల కోల్పోయాడన్నారు. బీసీ ముసుగులో బీసీ సామాజిక వర్గాన్ని మోసగిస్తున్నాడని, ఆత్మగౌరవం అనే పెద్దపెద్ద డైలాగ్లు కొడుతూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతు బంధు పెట్టిన రోజున ప్రతిపక్షాలు ఇలాగే ఓర్వలేదని, అదే పథకాన్ని బీజేపీ కాపీ కొట్టిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో రైతుబంధు ప్రారంభించినప్పుడు ఈటలకు ఎన్నికల సంగతి గుర్తుకు రాలేదు కానీ, ఇప్పుడు దళితబంధు పథకం తేవడంతో ఆ విషయం గుర్తుకు వస్తున్నదని విమర్శించారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే రైతుబంధు లాగానే దళితబంధు కాపీ కొట్టి దేశమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయని గుర్తు చేశారు.
రాష్ర్టానికి కేంద్రం నుంచి ఒక పథకం తీసుకురాని అసమర్థులు బీజేపీ నాయకులు అని మండిపడ్డారు. నిర్మల్ సభలో అమిషా కనీసం రాష్ర్టానికి ఒక మంచి ముచ్చట చెబుతారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూశారని, అయితే ఆయన తెలంగాణ గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని సుష్మాస్వరాజ్ గతంలో హామీ ఇచ్చారని, దీని గురించి పార్టీ అధిష్ఠానాన్ని అడిగే ధైర్యం బీజేపీ నాయకులకు లేదన్నారు. రైతులకు పసుపు బోర్డ్ తీసుకువస్తా అని హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ దానిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. బండి సంజయ్ది ప్రజా వంచిత యాత్ర అని, కరీంనగర్కు కనీసం ట్రిపుల్ ఐటీ తీసుకువచ్చేందుకు ప్రయత్నం కూడా ఆయన చేయలేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రాష్ట్రంలో ఒక సైనిక్ సూల్ తెచ్చే సామర్థ్యం లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక ప్రొసీడింగ్ అయినా తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. ఇకముందు బీజేపీ నాయకులు ఆత్మగౌరవం గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. అశోకచక్రవర్తి, అక్బర్, తానీషాకు మించి కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని కొనియాడారు. అసలైన లౌకికవాది ఆయనేనని స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ కళ్లెపెల్లి రమాదేవి, నాయకులు భూసారపు వెంకటేశ్వర్లు, భూసారపు బాపురావు పాల్గొన్నారు.