చొప్పదండి, ఆగస్టు 3: ఆడబిడ్డల పెండ్లికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మండలంలోని 73 మంది లబ్ధిదారులకు రూ.73 లక్షల 8 వేల 468 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2014కు ముందు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే పేదలు అప్పు తెచ్చేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి ద్వారా వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని కోరారు. దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతుందని, దీనిపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చెర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, తహసీల్దార్ రజిత, సర్పంచ్ గుంట రవి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్రెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, ఐలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.