హుజూరాబాద్, జూలై 29: ఈటల రాజేందర్ తాను చేసిన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి, స్వప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్కూర్మాచలం ధ్వజమెత్తారు. ఇతర పార్టీలతో, నాయకులతో కుమ్మకై తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేందర్ ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావో చెప్పాలని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో సిటీ సెంటర్ హాల్లో అనిల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాబోయే ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం పనికిమాలిన, నీతిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలతో పాటు మరెన్నో వస్తాయని, లేదంటే ప్రతిపక్షాలకు అవకాశమిస్తే అన్నీ బంద్ అవుతామని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ను కేసీఆర్ సొంత తమ్ముడిలా భావించి రాజకీయంగా ప్రోత్సహించి ఎన్నో అవకాశాలు కల్పిస్తే ఈటల మాత్రం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కరోనా రెండో దశలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు బీజేపీని వ్యతిరేకించిన ఈటల అదే పార్టీలో ఎందుకు చేరారో ప్రజలందరు ఆలోచించాలని కోరారు. రాజకీయ విలువల్లేని బీజేపీలో చేరి ఏ మొఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి ఆరోపణలు వస్తే కనీసం ఓపిక పట్టకుండా కన్నతల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని నాశనం కావాలని కోరుకున్నది నిజం కదా అని ప్రశ్నించారు.
‘పెడితే పెళ్లి .. లేకుంటే చావు కోరుతావు’ అన్న చందంగా అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. రైతు బంధు పథకం ప్రారంభోత్సవం చేసినప్పుడు లేని కడుపు నొప్పి దళిత బంధు పథకం ప్రారంభోత్సవంపై ఆరోపణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీశ్రెడ్డి గొట్టెముకుల, శానబోయిన రాజ్కుమార్, విక్రమ్కుమార్, తిరుమందాస్ నరేశ్, రఘువరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందె సాయిచరణ్, నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి రాకేశ్, టీఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ పాల్గొన్నారు.