మెట్పల్లి టౌన్, ఆగస్టు 2: పర్యావరణ హితమే ప్రధానంగా లక్ష్యం గా మెట్పల్లి పాలకవర్గం, ప్రజలు ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కాలనీల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణల్లో సైతం పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమవంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
ఏపుగా పెరిగిన మొక్కలు
హరితహారంలో భాగంగా మున్సిపల్ శాఖ, అటవీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. వీటితో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు పనికోసం వచ్చిన ప్రజలు వాటి కింద కూర్చొని సేద తీరుతున్నారు.
‘హరిత మెట్పల్లి’ లక్ష్యంగా..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ‘హరిత మెట్పల్లి’గా మార్చడమే లక్ష్యంగా మున్సిపల్, వివిధ శాఖల అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకు నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని మొక్కలు నాటుతున్నారు. ఈసారి హరితహారంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. వాటిని నాటిచడంతోపాటు సంరక్షణపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. గడిచిన ఆరు విడుతల్లో చేపట్టిన హరితహారం కార్యక్రమాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. మెట్పల్లి పట్టణంలో ఉన్న సబ్ కలెక్టర్, మున్సిపల్, ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ పార్క్, వ్యవసాయ మార్కెట్లో పచ్చదనం వెల్లివిరిస్తోంది.
బాధ్యతతో మొక్కలు నాటుతున్నాం..
హరితహారంలో భాగంగా నియోజకవర్గంలో బాధ్యతగా మొక్కలు నాటుతున్నాం. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అవగాహన కల్పిస్తున్నాం. రికార్డు స్థాయిలో మొక్కలు నాటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు ఆరు విడుతల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
-కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కోరుట్ల
పట్టణంలో 1.55 లక్షల మొక్కలు నాటుతాం
ఏడో విడుత హరితహారంలో మెట్పల్లి మున్సిపల్ పరిధిలో సుమారు 1.55 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గతంలో నాటిన మొక్కలు సంరక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. పట్టణంలోని వార్డులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయల్లో నాటిన మొక్కల సంరక్షణ కోసం టీగార్టులను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా వాటికి నీటిని అందిస్తున్నాం.
-రాణవేణి సుజాత, మున్సిపల్ చైర్పర్సన్, మెట్పల్లి