తెలంగాణచౌక్, జూలై 29: ఈటల రాజేందర్ బీజేపీలో చేరి దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నాడని తెలంగాణ ప్రజా సంఘల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గజ్జల కాంతం ధ్వజమెత్తారు. మనువాదం సిద్ధాంతంతో దేశంలోని దళితలను అణిచి వేయాలని కుట్ర చేస్తున్న బీజేపీని రానున్న హుజురాబాద్ ఎన్నికలలో ఓడిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మైత్రి హాటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని, దళితులకు రిజర్వేషన్లు దూరం చేయాలని ఆర్ఎస్ఎస్ ,బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీకి తెలంగాణలో ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈటల బావమరిది మధుసూదన్ రెడ్డి వాట్సాప్ వేదికగా దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వెంటనే మధుసూధన్రెడ్డిని అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దళితులను అవమానిపరిచి మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆగస్టు 4వ తేదీన జమ్మికుంటలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తునట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం తీసుకొచ్చారని, ఈ పథకాన్ని దళిత అభివృద్ధి నిరోధకులైన ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో ఇలాంటి సంక్షేమ పథకాన్ని ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను అవమాన పరిచేలా మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ దళిత వ్యతిరేకులన్నారు. బీజేపీ నాయకులు దళిత బంధు విమర్శించే ముందు మోడీ పేదల బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తుకు చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీ విషబీజాలను దళిత వర్గాలకు వివరించేందుకు ఆగస్టు 28న హుజూరాబాద్లో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, గజ్జల అనందరావు, సుద్దాల లక్ష్మణ్ పాల్గొన్నారు.