హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందుగానే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ సిద్ధాంతాలు, ఈటల విధానాలు నచ్చక నియోజకవర్గంలోని క్యాడర్ అంతా గులాబీ గూటికి చేరుతున్నది. ఏడేండ్ల ప్రగతి, సంక్షేమ పథకాలను చూసి చాలా మంది ఆకర్శితులవుతుండగా, పెద్దసంఖ్యలో తాకిడి కనిపిస్తున్నది. రోజురోజుకూ వలసల సంఖ్య పెరుగుతుండగా, టీఆర్ఎస్లో నయా జోష్ కనిపిస్తున్నది.
సీనియర్ నేతల చేరిక
బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకుడు మూడెత్తుల మల్లేశ్ యాదవ్ బుధవారం రాజీనామా చేసి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ పార్టీలో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపులేదన్నారు. దొంగలకు, కోవర్టులకు పార్టీ పట్టంగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హుజూరాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కూకట్ల సంతోష్కుమార్యాదవ్, అనుపురం అఖిల్గౌడ్, పొతరవేణి అనీల్కుమార్, దాసరి రాజు, గుండబోయిన అశోక్యాదవ్, గండు అఖిల్యాదవ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కరీంనగర్ మీసేవ కార్యాలయంలో వీరికి గులాబీ కండువా కప్పిన మంత్రి గంగుల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే కమలాపూర్, కానిపర్తి, సిరిసేడు, వీణవంక, మాదన్నపేట గ్రామాలకు చెందిన బేడ బుడగ జంగాల కుల సంఘం బాధ్యులు, బీజేపీ కార్యకర్తలు సిద్దిపేటలో టీఆర్ఎస్ కీలకనేత జోగినపల్లి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర నేత మౌటం రామ్కుమార్ అధ్యక్షతన డివిజన్ అధ్యక్షుడు మౌటం రాంచందర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి మౌటం వెంకటేశ్, జిల్లా యూత్ అధ్యక్షుడు తూర్పాటి శ్యామ్, నాయకులు వానరాశి తిరు మ ల్లయ్య, చింతల గిరి, మౌటం సురేష్, దేవరాజ్, నీలం రవి, గంధం రవి, కొండపల్లి శివరాం, తూర్పాటి ఐలయ్య, పస్తం కొమురయ్య, మౌటం సాయిపాటు మరో 100 మంది పార్టీలో చేరారు.
కిషన్రెడ్డి రాజీనామా..
బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి కిషన్రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈటల వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత స్వామ్య విధానంతో ఈటల పని చేస్తున్నందుకు రాజీనామా చేసినట్లు వివరించారు.
టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. హుజూరాబాద్లో బీజేపీ ఖాళీ అవుతున్నది. ఈటల తీరు నచ్చక పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి సీనియర్ నేతలు సహా క్యాడర్ అంతా గులాబీ గూటికి చేరుతున్నది. సర్కారు పాలనలో కనీవినీ ఎరుగని అభివృద్ధి.. ఊహించని పథకాలకు ఆకర్షితులై కొందరు చేరుతుండగా, మెజార్టీ క్యాడర్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక.. ఈటలతో ఇమడ లేక తరలివస్తున్నది. ముఖ్యంగా వారం రోజులుగా తాకిడి ఎక్కువవుతుండగా, కాషాయ పార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా పోతున్నది. కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి చేయిదాటిపోయినట్లు తెలిసింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, నాయకులు, భారీగా కారెక్కడం, పలువురు రాజీనామా చేయడం పరిస్థితికి అద్దంపడుతున్నది.