మెట్పల్లి,జూలై29: నిన్న మొన్నటిదాకా కొద్దిపాటి నీటితో కళతప్పిన గంగనాల ప్రాజెక్ట్ నేడు జల కళతో ఉట్టిపడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ నుంచి తరలివచ్చిన గోదావరి నీటితో ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పెరిగింది. మిగులు జలాలు అడ్డుగోడను దూకుతుండడంతో దిగువకు పరవళ్లు తొక్కుతున్నది. పక్కనే ఉన్న గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు పూర్వం 1959లో ప్రస్తుత ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి శివారులోని గోదావరికి సుమారు రెండు మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో అడ్డుగోడ (మత్తడి)ని నిర్మించారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని ఆరు గ్రామాలకు చెందిన దాదాపు 2500 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ నీటిపారుదల పథకానికి రూపకల్పన చేశారు. నిరంతరం నిండుకుండలా తొణికిసలాడుతూ ఆయకట్టు రైతుల పాలిట కల్పతరువుగా ఈ ప్రాజెక్టు ప్రసిద్ధిగాంచింది. అయితే మూడు, నాలుగేండ్లుగా వర్షపాతం తక్కువగా పడడంతో ఆశించిన మేర నీరు చేరకపోవడంతో బోసిపోయింది. ఇటీవల భారీ వర్షాలు కురువడం, గోదావరి ఉధృత ప్రవాహంతో వరదనీటి చేరికతో నిండుకుండను తలపిస్తున్నది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతాంగం సాగు పనుల్లో నిమగ్నమైంది.
మిషన్ కాకతీయ కింద పునరుద్ధరణ..
మిషన్ కాకతీయ పథకం కింద మంజూరైన రూ.2.30 కోట్లతో గంగనాల ప్రాజెక్టును పునరుద్ధరించారు. అనకట్టకు లీకేజీలతో నీరు వృథాగా దిగువకు పోయేది. దీంతో వానకాలం పంటలు మాత్రమే పండే పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి మిషన్కాకతీయ పథకం కింద రూ. 2.30 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో మాటు కాలువ ఆధునీకరణ, తప్పుపట్టిన గేట్ల మరమ్మతులు, కాలువపై కల్వర్టులు నిర్మించారు. పునరుద్ధరణ పనులతో ప్రస్తుతం ప్రాజెక్ట్లో జలాశయంలో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. తద్వారా ఆయకట్టు చివరి వరకు సాగునీరు సాఫీగా చేరుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల వేములకుర్తి, యామాపూర్, ఫకీర్కొండాపూర్, నడికుడ, మొగిలపేట, ఓబులాపూర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 2,500 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమికి సాగునీరు అందుతున్నది.