జగిత్యాల, ఆగస్టు 2 : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని ఇటీవలే చేపట్టింది. కార్డు మంజూరు ధ్రువీకరణ పత్రాలు అందజేసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కొత్తగా 24,034 కార్డులు రాగా, వీటికి మంగళవారం నుంచి ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయబోతున్నది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ కాగా, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టాక్ పాయింట్ల నుంచి బియ్యాన్ని రేషన్ దుకాణాలకు తరలించారు. నేటి ఉదయం నుంచి పంపిణీ మొదలు పెట్టనుండగా, పేద ప్రజలు సంబురపడుతున్నారు.
కొత్తకార్డులకు 10.. పాతవాటికి 15 కిలోలు
కొత్త కార్డుదారులకు ఈ నెలలో మనిషికి 10 కిలోల బియ్యం ఇస్తుండగా పాత కార్డు దారులకు మనిషికి 15 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత బియ్యం పంపిణీని ముందుగా జూన్ వరకు ఇవ్వాలని నిర్ణయించాయి. ఆ తర్వాత నవంబర్ దాకా కేంద్రం పొడిగించింది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు గత జూన్ 26న రాష్ర్టానికి అందాయి. దీంతో జూలైకి సంబంధించిన మనిషికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయలేక పోయాయి. జూలైలో కేంద్రం ఇచ్చే మనిషికి 5 కిలోలతోపాటు రాష్ట్రం ఈ నెలలో ఇస్తున్న 10 కిలోలు కలుపుకొని 15 కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కొత్త కార్డులు గత నెలలోనే మంజూరైన నేపథ్యంలో ఈ నెలకు సంబంధించిన ఉచిత బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నారు.
కరీంనగర్లో 2.16 లక్షల కిలోలు పంపిణీ
కరీంనగర్ జిల్లాలో 6,350 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఇందులో సుమారు 21,700 మంది లబ్ధిదారులు ఉండగా, మంగళవారం నుంచి తలా 10 కిలోల చొప్పున అంటే 2,16,990 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. జిల్లాలోని 487 రేషన్ దుకాణాలకు ఇప్పటికే బియ్యాన్ని చేరవేశారు. కాగా, కొత్త కార్డుల మంజూరుతో జిల్లాలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2,79,695కు చేరింది. జూన్ వరకు 2,73,345 కార్డులు మాత్రమే ఉండేవి. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులపై ప్రభుత్వం 1,25,25,080 కిలోల బియ్యం కేటాయిస్తుండగా, కొత్త కార్డులతో కేటాయింపు సైతం 1,27,42,070 కిలోలకు పెరిగింది.
జగిత్యాల జిల్లాలో 7,621 కార్డులు..
జగిత్యాల జిల్లాలో 7,621 కొత్త రేషన్ కార్డు లు పంపిణీ చేసింది. ఇందులోని లబ్ధిదారులందరికీ మంగళవారం నుంచి తలా 10కిలోల చొ ప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. జిల్లాలోని రేషన్ దుకాణాలకు ఇప్పటికే బియ్యాన్ని చేరవేశారు. కాగా, కొత్త కార్డుల మంజూరుతో జిల్లాలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 3,10,642కు చేరింది. జూన్ వరకు 3,03,021 కార్డులు మాత్రమే ఉండేవి. కాగా, కార్డుల పెరుగుదలతో బియ్యం కేటాయింపు సైతం పెరిగింది.
సిరిసిల్ల జిల్లాలో 2,777 కార్డులు
సిరిసిల్ల జిల్లాలో 2,777 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఇందులోని లబ్ధిదారులందరికీ మంగళవారం నుంచి తలా 10 కిలోల చొప్పున అంటే 90వేల కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. జిల్లాలోని రేషన్ దుకాణాలకు ఇప్పటికే బియ్యాన్ని చేరవేశారు. కొత్త కార్డుల మంజూరుతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 1,75,547కు చేరింది. జూన్ వరకు 1,72,770 కార్డులు మాత్రమే ఉండేవి. కాగా, కార్డుల పెరుగుదలతో బియ్యం కేటాయింపు సైతం పెరిగింది.
పెద్దపల్లి జిల్లాలో 7,286 కార్డులు..
సిరిసిల్ల జిల్లాలో 7,286 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఇందులోని లబ్ధిదారులందరికీ మంగళవారం నుంచి తలా 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. జిల్లాలోని రేషన్ దుకాణాలకు ఇప్పటికే బియ్యాన్ని చేరవేశారు. కాగా, కొత్త కార్డుల మంజూరుతో జిల్లాలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2,22,989కు చేరింది. జూన్ నెల వరకు 2,15,704కార్డులు మాత్రమే ఉండేవి. కాగా, కార్డుల పెరుగుదలతో బియ్యం కేటాయింపు సైతం పెరిగింది.