కరీంనగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నూతన పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ సోమవారం కరీంనగర్లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురికి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయాలని, శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదని, జిల్లా యంత్రాం గం మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్కు సూచించారు. మూడో విడత కరోనా వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వైరస్ ప్రభావం ఇంకా ఉందని, ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడి ఉండే కార్యక్రమాలకు స్వస్తి పలికాలన్నారు.
రోడ్లు, భవనాల అతిథి గృహ నిర్మాణ పనుల పరిశీలన..
కరీంనగర్ నగరంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం నిర్మాణ పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. అతిథి గృహం నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా పనులను సత్వవరమే పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, మిగతా పనులను ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు.