కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తామని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీవోలు, దళితబంధు రిసోర్స్పర్సన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నామని చెప్పారు. దళిత వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సర్వే టీంలు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం రూ. 70 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మండల, గ్రామాల రిసోర్స్ పర్సన్లు సర్పంచ్లతో కలిసి దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్దేశించారు. రిసోర్స్ పర్సన్లు కార్డుల్లేని వారికి అవగాహన కల్పించి దరఖాస్తులు సమర్పించేలా చూడాలన్నారు. దళితవాడల్లో రెవెన్యూ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు సర్వే చేసి సమస్యలను గుర్తించారన్నారు. ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేయడం, కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందేలా పైప్లైన్లు వేయాలని, అవసరమున్నచోట నల్లాలు బిగించాలని సూచించారు. లికేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఆర్డీఓ శ్రీలత, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మండల దళితబంధు రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.
ఇండ్ల మ్యుటేషన్ చేపట్టాలి..
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు కొనుగోలు చేసిన ఇండ్ల మ్యుటేషన్కు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సీఎం కార్యాలయ ఓఎస్డీ రామయ్యతో కలిసి సమీక్షించారు. దళితులు కొనుగోలు చేసిన ఇండ్ల మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూముల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఓఎస్డీ రామయ్య పెండింగ్లో ఉన్న ఇండ్ల మ్యుటేషన్ వివరాలు తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, లింకు డాక్యుమెంట్లు ప్రకారం మ్యూటేషన్లు చేయాలని సూచించారు.