మానకొండూర్ రూరల్, జూలై 31: అన్నదాతల శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శనివారం ఆయన రైతు వేదిక, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, రైతు వేదికతో గట్టుదుద్దెనపల్లి, వన్నారం, శంషాబాద్, గంగిపల్లి గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని కోరారు. మెట్ట ప్రాంతమైన మానకొండూర్ మండలానికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. గట్టుదుద్దెనపల్లిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, సర్పంచ్ దేవ సతీశ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. సర్పంచ్తో పాటు పాలకవర్గసభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు.
అనంతరం ఖాదరగూడెం చేరుకున్న ఎమ్మెల్యే మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ సాయవేని రాజు, ఎంపీటీసీ కనవేని శ్రీనివాస్తో కలిసి భూమి పూజ చేశారు. మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రసమయిని స్వశక్తి మహిళలు శాలువాలతో సన్మానించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, గట్టుదుద్దెనపల్లి సొసైటీ అధ్యక్షుడు అనభేరి రాధకిషన్ రావు, ఏఎంసీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎంపీవో ప్రభాకర్, వ్యవసాయాధికారులు, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.