కవి సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శరత్
ఇందూరు, ఏప్రిల్ 3 : మన దేశం కవులు, కళాకారులకు పుట్టినిల్లు అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అధ్యక్షత వహించగా, మంత్రి వేముల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేము ల మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వాతంత్య్ర స్ఫూర్తితో కవి సమ్మేళన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎందరో త్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. భారతదేశం అంటే సంస్కృతి , సంప్రదాయాలకు పెట్టింది పేరు అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ క్రమశిక్షణకు మారుపేరుగా ప్రపంచ దేశాల్లో పేరుగాంచిందన్నారు. దేశాభివృద్ధిలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కవితలు, పాటలు స్ఫూర్తిని రగిలించాయన్నారు. రాష్ట్ర సాధనకు ఎంతో దోహదపడ్డాయన్నారు. అనంతరం మంత్రిని నిర్వాహకులు ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కవులు ఘనపురం దేవేందర్, త్రివేణి ఆధ్వర్యంలో నిర్వహించగా, కవులు వీపీ చందన్రావు, నరాల సుధాకర్, సాయిబాబు, ఆష్ట గంగాధర్, రమేశ్, సాయి, చెన్న శంకర్తోపాటు 60 మంది కవులు పాల్గొన్నారు.
సమాజాన్ని ప్రభావితంచేసే శక్తి కవులకే ఉంది
ప్రజల్లో స్ఫూర్తి నింపి, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కవులకే ఉంటుందని కామారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ అధ్యక్షత వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్య్ర స్ఫూర్తి అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో తమ కవితలను వినిపించిన 70 మంది కవుల ను సత్కరించి, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని కవుల ద్వారా నేడు వినడం సంతోషంగా ఉందన్నారు. ఏ సమయంలోనైనా సమాజాన్ని ప్రభావితంచేసే శక్తి కవుల్లో ఉంటుందని, కవులు తమ రచనల ద్వారా స్వాతంత్య్ర పోరాటంలోనే కాకుండా సమాజంలో జరిగే అన్యాయాలపై కూడా ప్రజలను ఉత్తేజితులను చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ కవుల పాత్ర ప్రముఖంగా ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో కవులతోపాటు కవయిత్రులు హాజరుకావడం అభినందనీయమని అన్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్ అనూష, సమన్వయకర్తలు అంబీర్ మనోహర్రావు, శంకర్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.