లింగంపేట : నవంబర్ మాసంలో నిర్వహించే టీఆర్ఎస్ గర్జనకు నియోజకవర్గం నుంచి వందలాదిగా తరలిరావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లీనరి సమావేశానికి నియోజకవర్గం నుంచి అత్యధికంగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని సూచించారు. సమావేశానికి తరలడానికి ప్రతి గ్రామానికి బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఈనెల 27వ తేదీన ఎల్లారెడ్డి పట్టణంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావాలని తెలిపారు. ఈ సందర్భంగా రామరావ్ మహరాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు ఏలేటి శ్రీలత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, లింగంపేట, నల్లమడుగు సహకార సంఘాల చైర్మన్లు దేవేందర్రెడ్డి, రమేశ్, ఏఎంసీ వైస్చైర్మన్ నరహరి తదితరులు పాల్గొన్నారు.