విద్యానగర్, సెప్టెంబర్ : ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ జడ్పీ చైర్మన్, కామారెడ్డి జిల్లా ఇన్చార్జి దాదన్నగారి విఠల్ రావు అన్నారు.కామారెడ్డి మున్సిపల్ పరిధి లింగాపూర్ లోని బృందావన్ గార్డెన్లో గురువారం కామారెడ్డి నియోజకవర్గ విసృత స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకెళ్తుంటే ప్రతిపక్ష నాయకులు బాధ్యతారహితంగా, ఓర్వలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోరును అదుపులో ఉంచుకోవాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో 99 గ్రామాలు ఉంటే అన్ని కూడా ఏకగ్రీవం కావడం హర్షనీయమని అన్నారు. సభ్యత్వ నమోదులో సాధారణం 32,500, క్రియాశీల సభ్యత్వాలు 17,750 సభ్యత్వాలు తీసుకొని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని అందుకు కృషి చేసిన నాయకులను కొనియాడారు.
ప్రాంతీయ పార్టీగా 60 లక్షలు సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. అనంతరం నూతన మండల అధ్యక్షులను ప్రకటించి వారిని సన్మానించారు. విప్ గంపగోవర్ధన్ను తల్వార్తో, గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముజీబొద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ ఇందుప్రియ, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షుల ఎన్నిక
కామారెడ్డి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షునిగా జూకంటి ప్రభాకర్రెడ్డి, రాజంపేట్ మండల అధ్యక్షుడుగా దిక్కాజి బలవంత్రావు, భిక్కనూర్ మండల అధ్యక్షుడుగా పెద్ద బచ్చగారి నర్సింహారెడ్డి, దోమకొండ మండల అధ్యక్షుడుగా గండ్ర మధుసూదన్రావు, బీబీపేట్ మండల అధ్యక్షుడుగా చల్లపురం వెంకట్ గౌడ్, మాచారెడ్డి మండల అధ్యక్షుడుగా వడ్ల బాల్ చంద్రంను విప్ గంపగోవర్ధన్ ప్రకటించారు. అనంతరం వారిని సన్మానించారు.