బాన్సువాడ : మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నా ఏజెన్సీ నిర్వహకులు వంట చేసి 100 మంది విద్యార్థులకు వడ్డించారు. ఉపాధ్యాయులు కూడ పాఠశాలలో భోజనం చేశారు. భోజనం తిన్న వారిలో 30 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, తలతిప్పినట్లవడంతో వారిని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులను ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ హన్మాండ్లు, ఎంఈవో, తాసీల్దార్ గంగాధర్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులను దవాఖానకు తరలించారు.
విద్యార్థులను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ , డాక్టర్ సంతోష్ కుమార్లు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, పూర్థిస్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా విషయం తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం రాత్రి దవాఖానకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.