సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే సదాశివనగర్ పల్లె ప్రకృతి వనం భేష్గా ఉందని కేంద్ర బృందం
సభ్యులు ప్రశంసించారు. బుధవారం సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. నేషనల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాను ఎంపిక చేసిందని కేంద్ర బృందంలోని సభ్యులు శాస్త్రవేత్త సుదీర్ కుమార్ , గోదావరి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేవీకే కుచేల్ తెలిపారు. వారి పర్యటనలో భాగంగా సదాశివనగర్ మండల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా కొత్త చెరువు కట్టపై నాటిన ఈత వనాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి నాటిన మొక్కలు చెట్లుగా మారడంపై సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, పాలక వర్గం, అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలో గ్రామ, గ్రామాన అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలు, మంకీ ఫుడ్ కోర్టులు, రోడ్డుకు ఇరు వైపులా ఎవెన్యూ ప్లాంటేషన్లో మూడు వరుసలలో మొక్కలు నాటి పెంచడం ఎంతో బాగుందన్నారు.
రాష్ట్రంలో సదాశివనగర్ పల్లె ప్రకృతి వనం భేష్గా ఉందన్నారు. వనంలో ఆరోగ్య కరమైన, ఔషధ మొక్కలు పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఏపీడీ సాయన్న, ఉప సర్పంచ్ వంకాయల రవి, వార్డు సభ్యులు జగ్గ బాల్రాజు, వంగిటి సంతోష్ రెడ్డి, పెసరి సాయిలు, బండి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ ప్రతినిధులు బంజ శివకుమార్, నాయిని సాయన్న, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.