ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో 96 కేసులు
పలు గ్రామాల్లో నిర్ధారణ శిబిరాల ఏర్పాటు
సుంకినిలో వారంరోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్
విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 4: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వర్ని మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా మరో 16 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఆదివారం 328 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 14,331 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో 79 కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖఅధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,306 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
సుంకినిలో లాక్డౌన్..12 మందికి కరోనా పాజిటివ్
కోటగిరి, ఏప్రిల్ 4: మండలంలోని సుంకినిలో రెండురోజుల్లో 12 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గ్రామంలో లాక్డౌన్ విధించారు. జీపీ పాలకవర్గంతో చర్చించి గ్రామంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించాలని తీర్మానం చేశామని సర్పంచ్ మాధవ్రావు తెలిపారు. పూర్తిగా వ్యాపార దుకాణాలు, హోటళ్లు మూసి ఉంచాలని దండోరా వేయించామన్నారు. మహారాష్ట్ర నుంచి గ్రామంలోకి ఎవరినీ రానివ్వొద్దని సూచించారు. కరోనా కేసులు నమోదుకావడంతో గ్రామంలో ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. మొత్తం 52 మందికి టెస్టులు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. శనివారం ఐదుగురికి పాజిటివ్ వచ్చింది.
జోరుగా వ్యాక్సినేషన్
విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 4: కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆదివారం జిల్లాలోని 30 కేంద్రాల్లో 872 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 54,095 మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం 4200 మందికి గాను 1306 మంది కరోనా టీకా వేసుకున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఆన్లైన్లో ఫేస్బుక్ యూజర్ల డేటా!