ఇందూర్, ఆగస్టు 3: ఆరు రకాల ధీర్ఘకాలికవ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుంచి చేపడుతున్న హెల్త్వీక్ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. హరితహారంలో నూటికి నూరుశాతం లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు చేపట్టిన హెల్త్వీక్ సర్వే పద్ధతి ప్రకారం నిర్వహించాలని, ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను నమోదు చేయాలని అన్నారు. కరోనా వచ్చిన వారికి వెంటనే మెడికల్ కిట్ అందజేసి, తగ్గే వరకు పర్యవేక్షించాలని తెలిపారు. ఆరు రకాల వ్యాధులతో బాధపడేవారి వివరాలను యాప్లో నమోదు చేయడంతో ఆయా పేషెంట్లు దవాఖానలకు వెళ్లినప్పుడు చికిత్స అందించేందుకు దోహదపడుతుందన్నారు.
హరితహారం లక్ష్యాన్ని ఈ నెల 15లోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డీపీవో, పీఆర్, డీఆర్డీవో శాఖలు టార్గెట్ పూర్తిచేయాలని, బృహత్ పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటాలని తెలిపారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో గ్రీనరీ శాతం పెరగాలంటే డీపీవో, డీఆర్డీవో శాఖలపై పెద్ద బాధ్యత ఉందని, డీఆర్డీవో నుంచి ప్రతిరోజూ మొక్కలు నాటితేనే లక్ష్యం పూర్తవుతుందని, ఇందుకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పని కల్పించాలని సూచించారు. విద్యుత్ శాఖ, జిల్లా జైలు, పీఆర్ రోడ్లు, భవనాల శాఖల పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి ఫొటోలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, ఫారెస్ట్ అధికారి సునీల్, ట్రైనీ ఐఏఎస్ మకరంద్, డీఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.