స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవం
ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు సన్మానం
బాన్సువాడ, ఆగస్టు 29 : క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీస్టేడియంలో ఆదివారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్, హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం క్రీడాకారులు ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్చంద్ అన్నారు. అంతటి గొప్ప క్రీడాకారుడి జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్నారు. మారుమూల పల్లెల్లో పుట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బాన్సువాడ పట్టణంలోని క్రీడాకారుల సౌలభ్యం కోసం మినీ స్టేడియాన్ని నిర్మించామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను స్పీకర్ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షులు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, అలీమొద్దీన్ బాబా, కౌన్సిలర్లు హకీం, రమేశ్, రఫీ, నార్ల నందకిశోర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.