సోమవారం రాత్రి కురిసిన వాన జిల్లాను వణికించింది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా పలు రోడ్లు కొట్టుకుపోగా, ఇండ్లు కూలాయి. అనేకచోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. దెబ్బతిన్న పంటలను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
కూలిన ఇండ్లు
ధర్పల్లి మండలం హొన్నాజీపేట్లో ఐదు ఇండ్లు కూలినట్లు తహసీల్దార్ జయంత్రెడ్డి తెలిపారు. దుబ్బాకలో నాలుగు, మైలారంలో రెండు, రామడుగులో ఆరు, హొన్నాజీపేట్లో రెండు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. రామడుగులో ఎల్లమ్మ చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించి 20 ఇండ్ల్లు జలమయమయ్యాయని, ధర్పల్లిలో 47, హొన్నాజీపేట్లో 15 ఇండ్లలోకి వరదనీరు చేరిందని తహసీల్దార్ తెలిపారు. డిచ్పల్లి మండలం యానంపల్లిలో ఒకటి, ముల్లంగిలో రెండు ఇండ్లు వర్షం ధాటికి కూలాయి. పది గ్రామాల్లో 18 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చందూర్ మండలం లక్ష్మాపూర్లో ఒక ఇల్లు కూలింది. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి, లోలం గ్రామాల్లో రెండు ఇండ్లు కూలిపోయాయి. మోపాల్ మండలం సిర్పూర్లో మూడు, ముదక్పల్లిలో రెండు, న్యాల్కల్లో ఒకటి, కాల్పోల్లో ఒకటి, నర్సింగ్పల్లిలో ఒకటి, రుద్రూర్ మండలం చిక్కడ్పల్లిలో ఒక ఇల్లు కూలింది. బాల్కొండలో ఒకటి, చౌట్పల్లిలో ఒకటి, భీమ్గల్
మండలం కుప్కల్లో ఒక ఇల్లు కూలింది.
ఎడపల్లి మండలం అంబం(వై) లో మూడు, బోధన్లోని 16వ వార్డులో మూడు ఇండ్లు కూలిపోయాయి. మోర్తాడ్లో నాలుగు, సుంకెట్లో మూడు, దోన్పాల్లో రెండు, వడ్యాట్లో రెండు ఇండ్లు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి. రామచంద్రాపల్లిలో రెండు, ఒడ్యాట్పల్లి ఒకటి, ఆర్మూర్ పట్టణంలో, మండలంలోని 18 గ్రామాల్లో పాక్షికంగా ఏడు ఇండ్లు కూలిపోయాయి. రెంజల్ మండలం తాడ్బిలోలి, నీలా, కళ్యాపూర్, కునేపల్లి గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
నీటమునిగిన గుడిసెలు
జిల్లా కేంద్రంలోని యాదగిరిబాగ్ ప్రాంతంలో బ్రిడ్జి వద్ద 18 గుడిసెలు నీటమునిగాయి. అన్ని వస్తువులు కొట్టుకుపోయాయని బాధితులు తెలిపారు. గూపన్పల్లి, పాంగ్రా ప్రాంతాల్లోని వాగుగడ్డ నుంచి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తహసీల్దార్ ప్రశాంత్కుమార్ తెలిపారు. నిర్వాసితులకు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు.
నిలిచిన రాకపోకలు
డిచ్పల్లి మండలం నడిపల్లి-గాంధీనగర్ గ్రామాల మధ్య నిజామాబాద్-హైదరాబాద్ రోడ్డు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్పల్లి-సీతాయిపేట్ మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచి పోయాయి. వాడివాగు ఉధృతికి వాడి-హొన్నాజీపేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నగరం లోని కాలూర్ రోడ్డులో బైక్లు నీటిలోకొట్టుకుపోయాయి. యం చ, మిట్టాపూర్ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మూర్ మండలం మిర్ధాపల్లి – దేగాం, వేల్పూర్-మోతె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పంటల పరిశీలన
భారీ వర్షాలకారణంగా దెబ్బతిన్న పంటలను, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద పరిస్థితులను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. మంజీర పరీవాహక ప్రాంతాల్లోని హూన్స, మందర్నా, సాలూరా, సిద్ధాపూర్, ఖండ్గావ్, భిక్నెల్లిని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ సందర్శించారు. ధర్పల్లి మండలంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డీవో రవి పర్యటించి నీట మునిగిన పంటలను, కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. తహసీల్దార్ జయంత్రెడ్డికి పలు సూ చనలు చేశారు. సీతాయిపేట్-ధర్పల్లి మధ్య వరదప్రవాహాన్ని, పెద్దవాగు అలుగు ఉధృతిని జడ్పీటీసీ బాజిరెడ్డిజగన్ నాయకులతో కలిసి పరిశీలించారు. నీటమునిగిన పంటలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. దుబ్బాకలో వర్షం కారణంగా దెబ్బతిన్న వరిని రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. కోటగిరి మండలం పొతంగల్లో మంజీర ప్రవాహాన్ని, నీటమునిగిన పంటలను బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ తహసీల్దార్ శేఖర్తో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ మండలంలో దెబ్బతిన్న పంటలను తహసీల్దార్ ప్రశాంత్ అధికారులతో కలిసి పరిశీలించారు.
దెబ్బతిన్న రోడ్లు
ధర్పల్లి మండలం కేశారం, దమ్మన్నపేట్, ఎస్బీ తండా, మద్దుల్ తం డా రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ వద్ద ఆర్అండ్బీ రోడ్డు తెగిపోయింది. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి తండాకు వెళ్లే రోడ్డులో చిన్నవాగుపై రోడ్డు, గౌరారం-డొంకల్, నల్లవెల్లి-కేకేతండా రోడ్లు తెగిపోయాయి. చిన్నవాగును అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవి పరిశీలించారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్-గొన్గొప్పుల, చేంగల్, బడా భీమ్గల్, బెజ్జోరా, ముచ్కూర్, పల్లికొండ బాచన్పల్లి,రూప్లా తండా రోడ్లు ధ్వంసమయ్యాయి. మాక్లూర్ మండలం మదన్పల్లి, అమ్రాద్ గ్రామాల మధ్యన రోడ్డు తెగిపోయింది. వరద ఉదృత్తికి ధర్మాబాద్ – కందకుర్తి సమీపంలో ఫోర్లేన్ బీటీరోడ్డు కొట్టుకుపోయింది.
సిరికొండలో కుండపోత
సిరికొండ మండలంలో భారీ వర్షం కురిసింది. తూంపల్లి నుంచి పాకాల వెళ్ల్లే రోడ్డులో కప్పల వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. కప్పలవాగు చెక్డ్యాంకు గండిపడింది. ఎల్ల మ్మ చెరువు అలుగునీరు సిరికొండలోని వీధుల్లోకి చేరడంతో జనజీవనం స్తంభించింది. సబ్స్టేషన్లోకి నీరు చేరింది. పంటపొలాలు నీటమునిగాయి.