నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పలు నదుల సంగ మం. వాగులు, వంకలకు కొదువే లేని ప్రాంతం. పూర్తి వ్యవసాయక జిల్లాగా పేరొందిన ఉభయ జిల్లాలో భారీ వర్షాలతో దశాబ్ద కాలం క్రితం నాటి రికార్డు వరదలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2020 వానకాలం సీజన్లో భారీ వానలు కాసింత లాభం చేయగా ఈసారి సీజన్లో ఊహించని విధంగా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర నష్టం సంభవిస్తున్నది. జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు గోదావరి, మంజీరా నదులు వరదతో పోటెత్తి కనిపించాయి. 15 రోజుల క్రితమే ఉగ్రరూపం దాల్చిన నదులు తాజాగా గులాబ్ తుపాన్ మూలంగా మరింత ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నా యి. అంతర్రాష్ట్ర వంతెనలను ముంచెత్తుతూ ముందుకు సాగుతున్న ఈ రెండు నదులతో ఎస్సారెస్పీకి భారీగా వర ద వచ్చి చేరుతున్నది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువ కు వదిలి పెడుతుండడంతో గోదావరి ఉగ్రరూపంలో కనిపిస్తోంది. మంజీర, గోదావరి నదికి రెండు వైపులా మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ముప్పుతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నిరాటంకంగా వరదను విడిచి పెడుతున్నారు. తుపా న్ ముప్పు వీడేందుకు 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది.
నేలకు సమాంతరంగా…
గోదావరి, మంజీరా నదులు భూ ఉపరితలానికి సమాంతరంగా ప్రవహిస్తూ ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాయి. కందకుర్తి వద్ద గోదావరితో మంజీరా నది సంగమిస్తూ కోటగిరి మండలంలోని పలు పంటలను ముంచెత్తుతున్నది. కందకుర్తి గ్రామం వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గోదావరి నదిలోకి ప్రవాహ మట్టం ఎగబాకడంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. మొన్నటి వర్షాలకే కందకుర్తి గ్రామాన్ని వరద చుట్టేయగా తాజాగా తిరిగి అదే పరిస్థితి ఏర్పడింది. సాలూరా వద్ద అంతర్రాష్ట్ర వంతెన వరదతో ధ్వంసం కాగా ఇప్పుడు వంతెన మీది నుంచి తీ వ్ర స్థాయిలో మంజీర ప్రవహం కొనసాగుతున్నది. త్రివే ణి సంగమం వద్ద కూడా అంతర్రాష్ట్ర వంతెన మీది నుంచి జలాలు ప్రవహిస్తున్నాయి. నందిపేట మండలంలో అంతర్ జిల్లా బ్రిడ్ది వద్ద కూడా గోదావరి తీవ్ర రూపంలో కనిపిస్తోంది.
మంజీర తీరం అతలాకుతలం
బోధన్, సెప్టెంబరు 28: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని మంజీరా నదికి పెద్ద ఎత్తున వస్తున్న వరదకు తోడు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో ఈ నదీ తీరం అతలాకుతలంగా మారింది. మంజీర తీరంలోని అనేక గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లో పంట పొలాలు మంజీర వరద నీటిలో మునిగిపోగా, బోధన్ మండలంలోని హంగర్గా గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. మంజీర, గోదావరి నదుల వరదకు తోడుగా, స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీర తీరం వెంట జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బోధన్ మండలం బిక్నెల్లి గ్రామం లో పంట పొలాలు సోమవారం కొంతమేరకు మునగగా, మంగళవారం సాయంత్రానికి వాటి ఆనవాళ్లు తెలియనంతగా వరద చుట్టేసింది.