మెండోరా, సెప్టెంబర్ 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. 32 వరద గేట్లు ఎత్తి 99,840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. కాకతీయ కాలువకు 6వేలు, లక్ష్మీ కాలువకు 150, సరస్వతీ కాలువకు 800, వరద కాలువకు 9,746 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు(90.313 టీంఎసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1090.90 అడుగుల (89.763 టీఎంసీలు) నీటినిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్లోకి ఇప్పటివరకు ఈ సీజన్లో 318.503 టీఎంసీల వరద వచ్చినట్లు ఏఈఈ తెలిపారు.
నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో
నిజాంసాగర్, సెప్టెంబర్25: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తున్నట్లు నీటి పారుదల శాఖ డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రాజెక్టు నాలుగు వరద గేట్ల (2,3,6,7) ద్వారా 29,800 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా, 1200 క్యూసెక్కుల చొప్పున రెగ్యులేటర్ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 32,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని పోచారం, సింగూరు నుంచి ఇన్ఫ్లో ఒక్కసారిగా పెరిగిందని, రాత్రి వరకు ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని, నీటి విడుదలను ఇన్ఫ్లో కన్నా ఎక్కువ విడుదల చేస్తున్నామని తెలిపారు. నిజాంసాగర్ నీటితోపాటు నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతుండడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో అచ్చంపేట-నిజాంసాగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
‘కౌలాస్నాలా’ మూడు గేట్ల ఎత్తివేత
జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 2484 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు డీఈఈ దత్తాద్రి తెలిపారు. ఇన్ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రానికి మూడు వరద గేట్ల ద్వారా 2484 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు.