ధర్పల్లి, అక్టోబర్ 24 : మండలంలోనే మద్దుల్ అటవీ ప్రాంతం నుంచి ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తుతున్నారు. ధర్పల్లి నుంచి ఇందల్వాయి మధ్య ఉన్న మద్దుల్ అటవీప్రాంతంలో ఒకప్పుడు దొంగల బెడద తీవ్రంగా ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతంగుండాప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడేవారు. ప్రస్తుతం కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మద్దుల్ అటవీ ప్రాంతం క్రాసింగ్ రోడ్డు వద్ద కోతులబెడద ఎక్కువ కావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండగా, వీడీసీ సభ్యులు వాటిని బంధించి దూరంలోని అటవీప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మండల కేంద్రంలో కోతుల బెడద తగ్గింది.
ఇప్పుడు మద్దుల్ అటవీ ప్రాంతం క్రాసింగ్ వద్ద కోతుల బెడద ఎక్కువై వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు భక్తులు, మూగజీవాల ప్రేమికులు మద్దుల్ అటవీ ప్రాంతంలోని కోతులకు అప్పుడప్పుడు ఆహారం అందిస్తుండగా, రోడ్డు వెంట ప్రయాణించే వాహనదారులు ఆహారం తీసుకువచ్చారనుకుని వాహనాలకు ఎదురుగా వెళ్లడం, దాడి చేయడం చేస్తున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కోతులకు ఆహారం అందించే వారు అటవీప్రాంతంలో లోపలికి వెళ్లి అందిస్తే రోడ్డువెంబడి కోతుల బెడద ఉండదని వాహనదారులు అంటున్నారు.
ఇటీవల ఓ ద్విచక్ర వాహనదారుడు చిన్నారితో కలిసి వెళ్తుండగా, చిన్నారి చేతిలోని బ్యాగ్ను చూసిన కోతులు ఒక్కసారిగా మీద పడి దాడి చేయడం ప్రారంభించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన సదరు యువకుడు వాహనాన్ని అక్కడే వదిలేసి చిన్నారిని పట్టుకుని పరుగులు తీశాడు. కొద్ది సేపటి తర్వాత రోడ్డు వెంట వస్తున్న ఇద్దరు వాహనదారుల సహాయంతో కోతులను వెళ్లగొట్టి బండిని తీసుకుని వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటనలు మద్దుల్ రోడ్డులో నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, మండల ప్రజలు కోరుతున్నారు.