కామారెడ్డి, సెప్టెంబర్ 24: ఒక్కసారిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న మెన్నటి వరకు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్న జనం ఇప్పుడు డెంగీ, మలేరియా వ్యాధులతో సతమతమవుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడడంతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల నుంచి వృద్ధులు వ్యాధుల బారిన పడుతుండడం, రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో తండాలు, గ్రామాలతోపాటు పట్టణాల్లోని మురికివాడల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కరోనాతో ఇబ్బందులు పడిన వారిలో చాలా మంది డెంగీ బారిన పడుతుండడంతో వారి ఆరోగ్యపరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. డెంగీ కేసులు పెరుగుతుండడంతో ప్రైవేట్ దవాఖానల్లో దోపిడీ దందా కొనసాగుతున్నది.
ఆగస్టులో కేసులు అధికం
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 25 డెంగీ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్లోనే ఇప్పటివరకూ పది కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే అంశం. అత్యధికంగా ఆగస్టులో 11 కేసులు నమోదయ్యాయి. జూలైలో మూడు, జనవరిలో ఒక కేసు నమోదైంది. అధికారులు విడుదల చేసిన ఈ లెక్కల్లో తేడాలున్నాయని విమర్శలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని హన్మాజీపేట్, ఎల్లారెడ్డి, మత్తమాల, కామారెడ్డి అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హన్మాజీపేట్, మత్తమాల ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ఒక్క హన్మాజీపేట్ పరిధిలోనే ఐదు కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్, డ్రైవర్స్ కాలనీ, బతుకమ్మకుంట, కాకతీయ నగర్ ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్కు చెందిన ఓ ఆరేండ్ల బాలుడు డెంగీ బారిన పడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతేడాది జిల్లాలో 32 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 25 నమోదైనట్లు వైద్యశాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా డెంగీ కేసులు నమోదవుతున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వైద్యశాఖ నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
దవాఖానలు కిటకిట
కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలతోపాటు ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ పరిస్థితి విషమించడంతో నిజామాబాద్, హైదరాబాద్ నగరాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖాన, పీహెచ్సీల్లోకి వస్తేనే ప్రభుత్వ లెక్కలోకి వస్తుండగా, మిగతావి నమోదు కావడం లేదని తెలుస్తోంది. చాలా మంది డెంగీ రోగుల్లో ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒక బాటిల్ రక్తంతో సమానంగా ఉన్న ప్లేట్ లెట్స్ విలువ రూ.10వేల వరకు ధర పలుకుతుంది. ప్లేట్ లెట్స్ తగ్గిన రోగులకు 2,3 రక్తం బాటిల్స్ కావాల్సి వస్తుంది. ప్రైవేట్ దవాఖానల్లో డెంగీ బాధితులకు కనీసం రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతున్నది. రెండు నెలలుగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. కేసులు ఎక్కువగా వస్తుండడంతో వ్యాధి నిర్ధారణ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డెంగీ పరీక్షా కేంద్రాలు కేవలం ప్రభుత్వ జనరల్ దవాఖానల్లో ఉండడంతో ఎలిసా టెస్ట్ కోసం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం తెలంగాణ డయాగ్నోటిక్ కేంద్రాల్లో ఎన్ఎస్-1 టెస్ట్ కింద రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో డెంగీ పరీక్షల పేరిట ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీజనల్ వ్యాధులపై అవగాహన
సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఫీవర్ సర్వే చేయడంతోపాటు రోగులకు మందులను పంపిణీ చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బందితో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు.
అప్రమత్తత అవసరం
సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంటితోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ ప్రబలిన ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. అవసరమైన ప్రాంతాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం.
-డాక్టర్ చంద్రశేఖర్, కామారెడ్డి డీఎంహెచ్వో