కొందరి తీరుతో తెలంగాణ యూనివర్సిటీ అప్రతిష్ట పాలవుతున్నది. యూనివర్సిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన వ్యక్తులే అడ్డదారులు తొక్కి పాలకమండలి అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా పోస్టులు భర్తీ చేయడంపై నిరసన వెల్లువెత్తుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులు తప్పులు సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా వర్సిటీ విషయాలు బయటికి చేరవేయొద్దంటూ సిబ్బందికి హుకుం జారీచేశారు. మరోవైపు నెలరోజుల క్రితమే రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ కనకయ్యను వీసీ నియమించగా, ఆ నియామకానికి పాలకమండలి ఆమోదం ఇంకా లభించలేదు. అంతేకాకుండా రిజిస్ట్రార్గా ఉన్న వ్యక్తి ఆడిట్సెల్కు డైరెక్టర్గానూ కొనసాగుతుండడం కూడా వివాదాస్పదం అవుతున్నది.
నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల ప్రక్రియలో రోజుకో వ్యవహారం వెలుగు చూస్తు న్నది. యూనివర్సిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన వ్య క్తులే అడ్డదారులు తొక్కి ఇష్టానుసారంగా పోస్టులు భర్తీ చే యడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఉత్తర తె లంగాణలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న చోట కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనలతో అపకీర్తి మూట కట్టుకోవాల్సి వస్తున్నది. ఒకటి కా దు… రెండు కాదు… ఏకంగా 46 మందిని ఎలాంటి నో టిఫికేషన్లు, అర్హతలు, ఇంటర్వ్యూలు, మెరిట్ ఆధారితం గా సెలెక్ట్ చేయకుండా మౌఖిక ఆదేశాలతో ఎడాపెడా ఉ ద్యోగాల్లో పెట్టుకోవడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో చర్చించుకుంటున్నారు. తాజాగా మరో కొత్త విషయం బయటికి వచ్చింది. కొత్తగా వీసీగా నియామకమైన రవీందర్ గుప్తా నెల రోజుల క్రితమే రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ కనకయ్యను నియమించారు. ఈ నియామకా నికి ఇంత వరకు పాలక మండలి ఆమోదం తెలుపలేదు. అంతేకాకుండా రిజిస్ట్రార్ హోదాలో పని చేస్తున్న వ్యక్తి ఆ డిట్ సెల్కు డైరెక్టర్గా కొనసాగుతుండడం కూడా వివాదాస్పదం అవుతోంది. ఈ నియామకాల విషయంపై గవర్నర్ తమిళిసైతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి కోకొల్లలుగా ఫిర్యాదులు వెళ్లాయి. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దృష్టికి అక్రమాల వ్యవహారం వెళ్లడం తో ఇదేం పద్ధతి? అంటూ సీరియస్గా స్పందించినట్లుగా తెలుస్తోంది.
ఆచార్యుల మనస్తాపం…
అక్రమ నియామకాల వ్యవహారం బహిరంగం కావడం తో కొంత మంది కీలక వ్యక్తులు తప్పులు సరిదిద్దుకునే పనిలో మునిగిపోయారు. ఇందులో భాగంగా వర్సిటీ విషయాలు బయటికి చేరవేయొద్దంటూ హుకూం జారీ చేశారు. అంతేకాకుండా సమయపాలనతో సంబంధం లేకుండా బుధవారం రాత్రి 7.40 నిమిషాలకు ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందితో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఏ తప్పు చేయని తమను నిందించడం, రాత్రి వేళల్లో పురుషులతో పాటు మహిళా ప్రొఫెసర్లతో సమావేశం నిర్వహించి సీరియస్ అవ్వడంపై కొంతమంది ఆచార్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలిసి యూనివర్సిటీలో జరుగుతోన్న బాగోతాన్ని వివరించేందుకు ఐక్యమవుతున్నారు.
నిబంధనలు తుంగలో తొక్కి…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాలను కలపడంతో యూనివర్సిటీ సేవలు విస్తృతం అయ్యాయి. దీంతో వర్సిటీ సిబ్బంది, అధికారుల పని భారం కూడా పెరిగింది. పరిధి పెంపు నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలి వెలువరించి నెల రోజులైందో లేదో కొంత మంది ఆచార్యులు ఎడాపెడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తే తమకేమి లాభం అనుకున్నారో? ఏమో కానీ… కొద్ది రోజులుగా ఇష్టానుసారంగా 46 మందిని నిబంధనలకు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్ కింద నియామకం చేపట్టడం వివాదాస్పదం అవుతోంది.
అంతా ఆగమాగం…
రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2014లో టీయూలో 58 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. ఇం దులో రోస్టర్ పాయింట్ అనుసరించకపోవడంతో ఈ ని యామకాలు చెల్లవంటూ భాస్కర్ రావు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా కాకతీయ విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో పలువురిని ప్రభుత్వం తొలగించింది. టీయూలో నియామకమైన వారు కండిషన్ అపాయింట్మెంట్ పేరుతో హైకోర్టు ఆదేశాలతో పని చేస్తున్నారు. తుది తీర్పునకు లోబడి వీరంతా ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.ఈ వ్యవహారాలతో 2014 నుంచి ఏ రకమైన ఉద్యోగాల భర్తీకి ఆస్కారం లేకుండా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆదేశాలిచ్చింది. 2017లో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నాటి వైస్ చాన్స్లర్ సాంబయ్య 60 మందిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడం తో రూ.లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలతో ప్రభుత్వం స్పందించి త్రిసభ్య కమిటీని విచారణకు ఆదేశించగా వాస్తవమేనని తేలడంతో వారందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. తాజాగా అక్రమ నియామకాలపై ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేరాయి. ఉద్యోగాలు పొందిన వారంతా వారం రోజులు గా సంతకాలు చేశారు. ఈ వ్యవహారం అంతా వివాదాస్పదం అవుతుండడంతో వారందరినీ యూనివర్సిటీకి రావొద్దని అక్రమార్కులు ఆదేశించారు. సంతకాలు చేసిన రిజిస్టర్ కనిపించకుండా దాచిపెట్టినట్లు తెలుస్తున్నది.