గ్రామాల్లో నిస్వార్థం పెరిగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్వార్థంతో గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. ఈ గ్రామం ఆదర్శాలకు నిలయం. అభివృద్ధి వీచికలకు ప్రత్యేకం. పరిసరాల పరిశుభ్రత, చూడముచ్చట గొలిపే రహదారులు, పచ్చని చెట్లు పంచే ఆహ్లాదకర వాతావరణంతో అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్లో యువత, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు స్వార్థం వదిలి గ్రామాభివృద్ధికి కృషి చేయడంతో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నది. గ్రామస్తులంతా ఐక్యంగా చేపట్టిన కార్యక్రమాలతోపాటు పల్లెప్రగతి పనులతో మల్లాపూర్ రూపురేఖలు మారిపోయాయి.
ఇందల్వాయి, సెప్టెంబర్ 22
అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై, ఒకే మాట, ఒకే బాటతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో ముందంజలో ఉండాలని ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్వాసులు తపిస్తున్నారు. అందుకు రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సైతం గ్రామస్తులను ప్రోత్సహిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు. మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు రావడమే దీనికి నిదర్శనం.
పల్లె ప్రగతిలో ముందంజ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి పనుల్లో మల్లాపూర్ ముందంజలో ఉంది. గ్రామంలో వైకుంఠధామం, క్రిమిటోరియం, డంపింగ్ యార్డు, నర్సరీ, విలేజ్ పార్క్ పనులు పూర్తి చేశారు.
స్వచ్ఛ గ్రామం వైపు అడుగులు
స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. దీంట్లో భాగంగా గ్రామంలోని అన్ని కుటుంబాలు ఐహెచ్హెచ్ఎల్ మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 350 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 320 కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నాయి. మిగిలిన వాటి పనులు చివరి దశలో ఉన్నాయి. దీంతో మల్లాపూర్ సంపూర్ణ మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా నిలిచింది. అందుకోసం గ్రామ పంచాయతీ పాలకవర్గంతోపాటు అధికారులు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతుల్ని చేస్తున్నారు.
తడి, పొడి చెత్తపై కొత్త యాప్..
కలెక్టర్ ఆదేశాల మేరకు మల్లాపూర్ గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై మహిళలకు శిక్షణనిచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ప్రతి ఇంటి యజమాని ఫొటో, పేరు, ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రతి 25 ఇండ్లకు ఒక క్లస్టర్ ఇన్చార్జిని ఏర్పాటు చేశారు. గ్రామంలోని 350 ఇండ్లకు 14 మంది క్లస్టర్ ఇన్చార్జీలను నియమించారు. క్లస్టర్ ఇన్చార్జీలు ప్రతి ఇంటి ఎదుట తడి, పొడి చెత్త వేరు చేస్తున్నారా లేదా అని జియో కార్డు ట్యాప్ ద్వారా తెలుసుకుంటారు. ట్రాక్టర్ తడి, పొడి చెత్త కోసం బయల్దేరినప్పుడు యజమాని సెల్ఫోన్కు మెల్లేజ్ వస్తుంది.
వలంటీర్లకు బాధ్యత
గ్రామంలో వలంటీర్లకు తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేయడం నుంచి పంచాయతీ ట్రాక్టర్లలో విడి విడిగా వేసే వరకు వలంటీర్లు, కార్యదర్శులు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారు. వలంటీర్లు తమ పరిధిలోని ఇండ్లకు వెళ్లి చెత్తను విడివిడిగా నిల్వ చేస్తున్నారా లేదా పరీక్షిస్తారు. చెత్త సేకరించే వాహనంలో వేర్వేరుగా చెత్తను వేస్తున్నారా లేదా పర్యవేక్షించాలి. చెత్త నిల్వపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన వచ్చే వరకు వలంటీర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. ఎంపికైన వలంటీర్లు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పని చేయనున్నారు.
జిల్లాలో ఆదర్శంగా నిలిచేందుకే..
జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా నిలపడమే మా లక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అభివృద్ధిలో ముందువరుసలో ఉ న్నాం. మండలంలోనే ఉత్తమ గ్రామంగా అవార్డు రావడం గర్వంగా ఉంది. అధికా రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతున్నది.
సత్యనారాయణ, సర్పంచ్
ప్రజలకు సేవ చేయడం అదృష్టం
మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా గ్రామానికి ఉత్తమ జీపీ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది. గ్రామంలోని ప్రజల సహకారంతో మరిన్ని అవార్డులు పొందేందుకు కృషి చేస్తాం.
-రఘునందన్రావు, ఉపసర్పంచ్