మహారాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం సరిహద్దు ప్రాంతాల ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రవాణా వ్యవస్థకు కీలకమైన సాలూరా వద్ద ఉన్న మంజీర పాత వంతెన ఇటీవలి భారీ వర్షాలకు ధ్వంసమైంది. ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా 35 ఏండ్ల క్రితం నిర్మించిన పెద్ద వంతెన సైతం శిథిలావస్థకు చేరింది. ఆ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాల రాకపోకలను ఏడాది కాలంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింత ధ్వంసం కావడంతో అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. అటు పాత వంతెన ధ్వంసమై.. ఇటు కొత్త బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు వంతెనలు తన ఆధీనంలోనే ఉన్నా.. వాటిపై నుంచి రవాణావ్యవస్థ పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. పాత వంతెన ధ్వంసమై 15 రోజులు కావస్తున్నప్పటికీ, మరమ్మతుల విషయంలో
మహారాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
బోధన్, సెప్టెంబరు 22 : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో ఇరురాష్ట్రాల ప్రజల రాకపోకలకు, వివిధ రాష్ర్టాల మధ్య రవాణాకు కీలకమైన జిల్లాలోని సాలూరా వద్ద ఉన్న మంజీర పాత వంతెన, పెద్ద వంతెన ధ్వంసం కావడంతో సరిహద్దులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ డివిజన్ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో బోధన్ – నాందెడ్ ప్రధాన రహదారిలో మంజీర నదిపై ఉన్న ఈ రెండు సమాంతర వంతెనలు ఇటీవలి వరకు రెండు రాష్ర్టాల మధ్య ప్రజల రాకపోకలు, సరుకుల రవాణా అవసరాలను తీర్చేవి. ఈ నెల 7,8 తేదీల్లో మంజీరా నదికి ఊహించని విధంగా భారీ వరదల ఫలితంగా వందేండ్ల కింద నిర్మించిన, ఇటీవలి వరకు ఉపయోగంలో ఉన్న పాత వంతెన ధ్వంసమైన విషయం తెలిసిందే.. అంతకుముందే ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా 35 సంవత్సరాల కిందట నిర్మించిన పెద్ద వంతెనకు పగుళ్లు రావడంతో ఆ వంతెనపై నుంచి భారీ వాహనాల రాకపోకలను సుమారు ఏడాది కాలంగా నిలిపివేశారు.. కాగా, ఇటీవల వరదలకు పెద్ద వంతెన నిర్మాణంలో బాల్స్ జరిగిపోవడం, ఫలితంగా వంతెన ఫలకల మధ్య గ్యాప్లు పెద్దవి అయ్యాయి. దీంతో ఆ వంతెనపై నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రెండు రాష్ర్టాల మధ్య ఎన్నో ఏండ్లుగా నిరంతరం కొనసాగుతూ వచ్చిన సంబంధాలు తెగిపోయాయి. సరుకుల రవాణాతో పాటు ప్రయాణాలు నిలిచిపోవడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు వంతెనలు మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ.. ఈ వంతెనలపై రవాణా పునరుద్ధరణకు ఆ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. మంజీరా నదిపై పాత వంతెన ధ్వంసమై 15 రోజుల కావస్తున్నప్పటికీ, ఆ వంతెనకు తాత్కాలికమైన మరమ్మతులు చేపట్టే విషయంలో మహారాష్ట్ర సర్కార్ నుంచి స్పందన కనిపించడంలేదు.. ఫలితంగా సరిహద్దు ప్రాంతం ప్రజలు కష్టాలు పడుతున్నారు.
జంట వంతెనల ప్రాధాన్యత
మంజీరపై పాత వంతెనను 1930 దశకం ప్రారంభంలో ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. మంజీరా నదికి ఏమా త్రం వరద వచ్చినా ఈ వంతెన పైనుంచి వరద ప్రవాహం ఉంటుంది. రాతితో నిర్మించిన ఈ వం తెన ఇప్పటి వరకు చెక్కుచెదరని రీతిలో ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇది లోలెవల్ వంతెన కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా 1986లో మరో భారీ వంతెనను మంజీరా నదిపై నిర్మించారు. అప్పట్లో ఆ వంతెనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బీ చవాన్ ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.5 కోట్ల స హాయాన్ని అందించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కారణంగా తమ భూభాగంలోని అనేక రోడ్లు ముం పునకు గురవుతున్నాయని మహారాష్ట్ర సర్కార్ వాదించడంతో,ఆ సహాయాన్ని అప్పట్లో అందించారు. అయితే, ఈ రెండు వంతెనలు మహారాష్ట్ర భూభాగంలోనే ఉన్నాయి. ఈ కొత్త (పెద్ద) వంతెనకు కొంతకాలంగా బీటలు రావడంతో భారీ వాహనాలను అనుమతించడంలేదు. దీంతో పురాతనమైన వంతెన మీదుగానే వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి.కాగా, ఈ పురాతన వంతెన కూడా ధ్వంసం కావడంతో రెండు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సా లూరా వద్ద మన భూభాగంలో బోధన్ – నాం దెడ్ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసేందుకు ఇరు రాష్ర్టాల అధికారులు వారివారి భూభాగంలో రహదారికి అడ్డంగా కందకాలు తవ్వారు.
రవాణా అస్తవ్యస్తం.. చెక్పోస్ట్ ఆదాయం నిల్
మంజీరపై వంతెనలు పాడవడంతో స్థానికంగా జరి గే వస్తువులు, సరుకుల రవాణాతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి రాష్ర్టానికి వచ్చే, పోయే రవాణా వాహనాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో సాలూరా వద్ద ఉన్న ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ఆదాయం పూర్తిగా పడిపోయింది. మహారాష్ట్ర నుంచే కాకుండా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ర్టాల నుంచి సరుకుల లారీలు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ర్టాలకు ఇదే రహదారి ద్వారా వస్తుంటాయి. అలాగే, ఒరిస్సా, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్ర్టాల వాహనాలు ఇదే మార్గం ద్వారా ఉత్తరాది రాష్ర్టాలకు వెళ్తుంటాయి. ఇంతటి కీలకమైన మార్గం మూతపడడంతో సరుకుల వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఇరు రాష్ర్టాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నా యి. స్థానికంగా కూరగాయలు, పండ్లు, పప్పులు తదితర సరుకుల రవాణాకు ఇప్పుడు ఇబ్బంది ఏర్పడింది.
ఏరు దాటలేక పాట్లు
బోధన్ ప్రాంతంలోని రైతులకు మంజీర అవతలి తీరాన వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ వంతెనలపై రాకపోకలను నిషేధించడంతో తమ పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. అసలే భారీ వర్షాలు.. తమ చేలల్లో పంటల పరిస్థితి ఏమవుతుందో తెలియని ఆందోళనలో రైతులు ఉన్నారు. తమ పొలాలకు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను ఎలా తీసుకెళ్లాలో వారికి పాలుపోవడంలేదు. ఇక, ఇక్కడి నుంచి తమ పొలాలకు కూలీలను తీసుకెళ్లడం కూడా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ప్రమాదకరమైన వంతెనలపై నడిచి వెళ్తున్నారు.. సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య సంబంధ, బాంధావ్యాలు కూడా ఎక్కువే.. ఇక్కడివారు, అక్కడివారు సంబంధాలు కుదుర్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటుంటారు…ఇప్పడు ఈ ధ్వంసమైన వంతెనల పుణ్యామా అని శుభకార్యాలకే కాకుండా, చావులకు కూడా హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మహారాష్ట్ర సర్కార్ పాత వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, తేలికపాటి వాహనాల రాకపోకలను పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు. అలాగే, బీటలు వారిన పాత వంతె న స్థానంలో నిపుణుల సిఫార్సుల మేరకు కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం..
మంజీరపై ఉన్న రెండు వంతెనలపై రాకపోకలు నిషేధించcంతో మా గ్రా మంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా, వివాహాలకు వెళ్లాలన్నా చాలా దూరం ప్ర యాణించాల్సి వస్తున్నది. ముఖ్యంగా పొట్టకూటి కోసం కూలీ పని చేసుకునేవారికి, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. పాత వంతెనపై ధ్వంసమైన ఫలకలను సరిచేసి, తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని మహారాష్ట్ర సర్కార్ను కోరుతున్నాం.. మరో వంతెన నిర్మాణం జరిగే వరకు కనీసం చిన్న వాహనాల రాకపోకలు జరిగేలా చూడాలి.
-కేజీ గంగారాం, రైతు, సాలూరా