మెండోరా/నిజాంసాగర్, సెప్టెంబర్ 22: ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 70,580 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో 20 గేట్లను ఎత్తి 74,880 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు. కాకతీయ కాలువకు 6వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 150, సరస్వతీ కాలువకు 800, వరద కాలువకు 12,004 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, బుధవారం సాయంత్రానికి అంతేస్థాయిలో ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 311.713 టీఎంసీల వరద వచ్చినట్లు తెలిపారు.
నిజాంసాగర్ 2 గేట్ల ద్వారా..
సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్లోకి 12,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నదని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. రోజురోజుకూ ఇన్ఫ్లో పెరుగుతుండడంతో ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా అంతేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. బుధవారం 11,300 క్యూసెక్కుల నీటిని వరదగేట్ల ద్వారా, మరో 1200 క్యూసెక్కులను ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు వివరించారు.