వేల్పూర్, సెప్టెంబర్ 20: ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారంతా వెంటనే స్పందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యాల బారినపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారి పట్ల ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఫోన్ పిలుపు వచ్చిన మరుక్షణమే అవసరమైన ప్రాంతాలకు వెళ్లి రక్తదానం చేసి క్షతగాత్రులకు ఆత్మబంధువులుగా నిలుస్తున్నారు. పలువురిలో కనిపించే సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజానికి తమవంతు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇలా ఒకరినుంచి మరొకరు స్ఫూర్తిని పొంది పలు గ్రామాల యువకులందరూ రక్తదాతలుగా మారారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలానికి చెందిన యువకులంతా కలిసి ఓ బృందంగా ఏర్పడి స్నేహాలయ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సంస్థ ద్వారా ఇతరులకు ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా ఉధృతి సమయంలో ప్రజల ఇబ్బందులను గుర్తించి చేయూతనందించారు. కొవిడ్-19 విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రమాదాల్లో గాయపడి రక్తం లభించక పలువురు మరణించారు. క్లిష్టపరిస్థితుల్లోనే సమాజానికి తమవంతుగా తోడ్పాటును అందించాలనే సంకల్పంతో కరోనాను ఎదురించి ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు. మండలానికి చెందిన వారే కాకుండా ఇతరులు కూడా సంస్థలో చేరేందుకు ఆసక్తి చూపగా వారి ఆశయం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీంతో వాట్సాప్లో ఓ ప్రత్యేక గ్రూప్ను రూపొందించారు. అందులో రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే సుమారు 50 మంది యువకుల నంబర్లను ఉంచారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎవరైనా రక్తం కావాలని చెబితే చాలు గ్రూపులో ఉన్న వారు వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నారు. సంస్థ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే ఇప్పటి వరకు 52 మందికి రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వివాహ వార్షికోత్సవం రోజే రక్తదానం చేశా..
నా వివాహ వార్షికోత్స వం సందర్భంగా ఇంట్లో వేడుకలు చేసుకుంటున్నాం. అంతలోనే నాకు ఫో న్ వచ్చింది. గోవింద్పేట్ గ్రామానికి చెందిన సుజాత అనే మహిళకు ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని, అర్జెంటుగా ‘O ’ పాజిటివ్ రక్తం అవసరమున్నదని చెప్పారు. మా బృం దానికి చెందిన పురుషోత్తం నేను కలిసి నిజామాబాద్లోని దవాఖానకు వెళ్లి రక్తదానం చేశాం.
-కమలేశ్, వేల్పూర్
మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం
రక్తం కోసం ఎవరూ ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో స్నేహాలయ స్వచ్ఛంద సంస్థ ను ఏర్పాటు చేసుకున్నాం. 50 మందితో కలిసి వాట్సా ప్ గ్రూపును ఏర్పాటు చే శాం. ఎవరైనా రక్తం కావాల ని తమకు సమాచారం ఇస్తే చాలు ఎంత దూరం అయి నా వెళ్లి రక్తదానం చేస్తు న్నాం. రాత్రివేళలో సైతం పిలుపు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్తదానం చేసేందుకు సంస్థ సభ్యులు ముందుకు వస్తున్నారు.
-నందిపేట శంకర్, వేల్పూర్
ఎంతో మేలు చేశారు
మాది గోవింద్పేట్…నా భార్య సుజాత డెంగీతో వారం రోజులపాటు దవాఖానలో ఉన్నది. ప్లేట్లెట్స్ తగ్గడంతో రక్తం కావాలని డాక్టర్లు చెప్పారు. తన స్నేహితుల ద్వారా స్నేహాలయ సంస్థ సభ్యులకు ఫోన్ చేశాను. సంస్థకు చెందిన 8మంది రక్తదానం చేశారు. నేను వారికి రుణపడి ఉంటాను.