ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ధాన్యం సేకరణకు సన్నద్ధమవుతున్నది. నిజామాబాద్ జిల్లాలో 458, కామారెడ్డి జిల్లాలో 343 కేంద్రాల ద్వారా 14 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించి బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు.
నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి, అక్టోబర్ 19 : అన్నదాతకు అండగా ఉండేందుకు ఏటా వారు పండించిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. వానకా లం పంటను సేకరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దళారులను ఆశ్రయించి కర్షకులు మోసపోకుండా మద్దతు ధరకు ఈ కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరిస్తారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇటీవల సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్లు నిర్వహించారు. కేంద్రాలు, ఇతర అంశాలపై చర్చించి… తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ వానకాలంలో తొలకరి నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ధాన్యం దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది అధిక వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కురిసినా నీరు చేరే అవకాశం లేకుండా ఎత్తయిన ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి కూడా వాటిని గుర్తించారు. తద్వారా ధాన్యం తడవకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. నేడు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇదే అంశంపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
భారీగా ధాన్యం దిగుబడి…
వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ సన్నద్ధం అవుతున్నది. జిల్లాలో సాగైన పంట విస్తీర్ణం, దిగుబడి అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక రూపొందించింది. నిజామాబాద్ జిల్లాలో 458 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 343 కేంద్రాల ద్వారా దాదాపు 14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఇరు జిల్లాల యంత్రాంగం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించడంతో సంబంధిత శాఖల అధికారులు కేంద్రాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏటా రెండు పంటలు సాగు చేస్తుండగా అందులో ఎక్కువగా వరి ఉంటోంది. ప్రస్తుతం వానకాలంలో అడపాదడపా వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరగా అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 10లక్షల 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోందని అంచనాలున్నాయి. కొద్ది మొత్తంలో ధాన్యం కొనుగోళ్లు ప్రైవేటులో జరిగినప్పటికీ 9లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యపు రాశులు ప్రభుత్వ కేంద్రాలకే చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వచ్చే అవకాశాలుండగా 5లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు అవకాశాలున్నట్లుగా అధికారులు అంచనా వేశారు.
ఇబ్బందుల్లేకుండా వసతుల కల్పన…
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించేందుకు ఆయా శాఖలు సన్నద్ధం అవుతున్నాయి. కొనుగోళ్లకు అవసరం అయ్యే వాటిని పౌరసరఫరాల సంస్థ సమకూరుస్తోంది. ఈ సీజన్లో దాదాపు కోటిన్నర గన్నీ సంచులు అవసరం ఉంటాయని భావిస్తుండగా ప్రస్తుతం సగం వరకు అందుబాటులో ఉన్నాయి. కేంద్రాలు అన్నీ ప్రారంభమై ధాన్యం తరలించే సమయానికి మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 25 టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. కొనుగోలు కేంద్రాలు మొదలైన తర్వాత రైతుల కష్టాలు మొదలవుతాయి. కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులకు పూర్తి స్థాయిలో టార్పాలిన్లు సరఫరా చేయకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్లో నమోదు చేయాల్సి ఉండగా వారు జాప్యం చేస్తుండగా రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ కావడంలేదు. గతేడాది ఎదురైన సమస్యలు ఈసారి సీజన్లో పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఆదేశాలు జారీ చేసింది. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2021 యాసంగి ధాన్యాగారమై నిలిచింది. రికార్డు స్థాయిలో పంట చేతికి రావడంతో ధాన్యం కొనుగోళ్లు కనీవిని ఎరుగని రీతిలో జరిగాయి. రెండు జిల్లాల్లో జరిగిన కొనుగోళ్ల మొత్తం రూ.2,200 కోట్లు దాటడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మొన్నటి యాసంగి సీజన్లో పౌరసరఫరాల శాఖ అనేక సవాళ్లను ఎదుర్కొంది. కరోనా విస్తృతి, లాక్డౌన్ అమలు వంటి సంక్లిష్టమైన సమయంలో ఊహించని రీతిలో వచ్చిన పంట ఉత్పత్తులను సాఫీగా సేకరించింది. అంతేగాకుండా ఇబ్బందులను అధిగమిస్తూ రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యాన్ని సైతం పెద్ద ఎత్తున సేకరించింది. కర్షకులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉభయ జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తయ్యింది. నిజామాబాద్ జిల్లాలో 442 కొనుగోలు కేంద్రాల నుంచి 7లక్షల 43వేల 531 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.1,398 కోట్లు. కామారెడ్డి జిల్లాలో 342 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 4లక్షల 51వేల154 మెట్రిక్ టన్నులు సేకరించారు. దీని విలువ రూ.850.42 కోట్లు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యం రూ.2,248 కోట్ల్ల విలువ చేసే 11లక్షల 94వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం రికార్డు అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.